సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 24: అభివృద్ధికి మూలం మానవ వనరులేనని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రభుత్వ కార్యదర్శి భారతీ హొళికేరి అన్నారు. శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ, అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ సంయుక్తంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో అంగన్వాడీ టీచర్ల పూర్వ ప్రాథమిక విద్యా సదస్సును నిర్వహించారు. కలెక్టరేట్లో ఏర్పా టు చేసిన స్టాళ్లను కలెక్టర్ శరత్తో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా భారతీ హొళికేరి మాట్లాడుతూ మన పిల్లలకు మంచి విద్య, కాలుష్యం, కల్మషం లేని వాతావరణాన్ని అందించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అప్పుడే సుస్థిర అభివృద్ధి జరుగుతుందన్నారు. అంగన్వాడీ టీచర్లను భాగస్వాములు చేసి జిల్లా స్థాయి సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. మనిషికి కావాల్సింది మంచి ఆరోగ్యం, విద్య అన్నారు. అంగన్వాడీ టీచర్లు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించడంతో గట్టి పునాది పడుతుందన్నారు. బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో నివారించాలన్నారు. మహిళలు, పిల్లల హక్కులను కాపాడితే కల్మషం లేని సమాజం ఏర్పడుతుందన్నారు.
కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ ఒక గ్రామం ఆదర్శవంతంగా ఉందంటే అక్కడ అంగన్వాడీ బాగా పనిచేస్తుందని చెప్పవచ్చన్నారు. సెమినార్లో ఆయా అంశాలను అంగన్వాడీ టీచర్లు తమ కేంద్రాల్లో అమలు చేయాలన్నారు. ప్రతి పౌరుడి పునాది అంగన్వాడీలోనే ఉన్నదన్నారు. తల్లి బాగుంటే బిడ్డ బాగుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని కలెక్టర్ వివరించారు. అనంతరం పోషణ పక్షం పోస్టర్ ఆవిష్కరించారు. విప్రో ఫౌండేషన్ ప్రతినిధులు అందించిన ప్లే స్కూల్ మెటీరియల్ను అంగన్వాడీ టీచర్లకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి పద్మావతి, అజీమ్ ప్రేమ్జీ రాష్ట్ర ప్రతినిధి ఎం శ్రీనివాస్, జిల్లా ప్రతినిధి యోగేశ్, విప్రో ఫౌండేషన్ ప్రతినిధులు రామకృష్ణ, మీనా, సీడీపీవోలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.