రామాయంపేట, డిసెంబర్ 7 : ఆ నిరుపేద గిరిజన మహిళా కుటుంబానికి భూమిలేదు. వ్యవసాయం చేయడంలో మాత్రం అందరికీ ఆదర్శం. రామాయంపేట మండలం కోనాపూర్ గిరిజన తండాకు చెందిన మాలోత్ లత. తండాలోనే ఓ గిరిజన రైతుకు చెందిన భూమిని కౌలు తీసుకొని కూరగాయలను పండిస్తున్నది. ఎనిమిది గుంటల భూమిని కౌలుకు తీసుకొని అందులో పది రకాల అంతర పంటలను పండిస్తూ .. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది. తాను కౌలుకు తీసుకొన్న భూమిలోనే కూరగాయ పంటలైన టమాట, కొత్తిమీరా, పూదీనా, పాలకూర, బెండ, ఉల్లి, వంకాయ, పెద్ద చిక్కుడు తదితర పంటలను పండిస్తున్నది.అంతర పంటలవైపు మహిళా రైతు మళ్లడంతో వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఆమెకు పంటలపై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. 80 రోజుల్లోనే పంట చేతికి రావడంతో వాటిని రోజువారీగా గంపల్లో తీసుకెళ్లి అంగడిలో విక్రయాలు జరుపుతోంది. మూడు నెలల్లోనే రూ. లక్ష ఆదాయాన్ని ఆర్జించింది. భర్త ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీ చేయడం, సాగులో సాయం చేస్తూ, ఇద్దరు పిల్లలను పోషిస్తున్నామని తెలిపింది.
అంతర పంటలపై అవగాహన కల్పిస్తున్నాం..
రామాయంపేట మండలం, కోనాపూర్ క్లస్టర్ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనే పొలాల వద్దకు వెళ్లి అంతర పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు క్లస్టర్ పరిధిలోని 30 ఎకరాల వరకు రైతులు కూరగాయల పంటలను పండిస్తున్నారు.
కూరగాయల సాగుతో లాభాలు..
తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లుగా కూరగాయల సాగుతోనే లాభాలు గడించొచ్చు. నేను కౌలుకు తీసుకున్న ఎనిమిది గుంటల భూమిలో పది రకాల పంటలను పండిస్తున్నా. ఒక పంట చేతికి రాగానే, వాటిని విక్రయిస్తూ.. మరొక పంట సాగు చేస్తున్నా. ఇలా రెండేండ్లుగా కౌలు భూమిలో కాయగూరలను పండి స్తూ.. లాభాలను గడిస్తున్నా.
-మాలోత్ లత, మహిళా కౌలు రైతు