ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధ పడకూడదనే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి విడతలో ఉచితంగా పరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహించి మందులతో పాటు కండ్లద్దాలు అందజేసి ఎంతో మంది పేదలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఇదే స్ఫూర్తితో రెండో విడతను రేపటి నుంచి చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం కేసీఆర్ ఈ నెల 18న ఖమ్మంలో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మరుసటి రోజు (19న) జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సోమవారం ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వహించి ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు చేశారు.
సిద్దిపేట, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ఖమ్మంలో సీఎం కేసీఆర్ ఈ నెల 18న లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు 19న ఉదయం 9 గంటలకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు జిల్లాల్లో అధికార యంత్రాంగం ఇందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులు ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయడంతోపాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తొలి విడత కార్యక్రమానికి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్లో సీఎం కేసీఆర్ 2018, ఆగస్టు 15న శ్రీకారం చుట్టారు. నాలుగేండ్ల కిందట ప్రారంభించిన తొలి విడత కార్యక్రమం ఎంతో మంది పేదలకు భరోసానిచ్చింది. రెండో విడతపై ఇప్పటికే గ్రామాల్లో విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. మండల, గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో టాంటాం, వాల్పోస్టర్లు, కరపత్రాలు, భారీ ఫ్లెక్సీలు తదితర రూపాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ రోజు ఎక్కడ నిర్వహిస్తారనేది ముందుగానే సమాచారం ఇస్తున్నారు. రేషన్ షాపులు, ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రచారంలో మహిళా సంఘాలు, అంగన్ వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేశారు. ఇప్పటికే జిల్లాకు అవసరమైన కంటి అద్దాలు వచ్చాయి.
పక్కా ప్రణాళిక…
మొదటి విడతలో కంటి వెలుగు స్ఫూర్తితో రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా వైద్యాధికారులు పక్కా ప్రణాళిక అమలు చేయనున్నారు. తొలి విడత కంటివెలుగు కార్యక్రమాన్ని మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ వేదికగా సీఎం కేసీఆర్ 2018, ఆగస్టు 15న ప్రారంభించారు. అప్పటి నుంచి 2019, మార్చి వరకు కొనసాగింది. తొలి విడత సిద్దిపేట జిల్లాలో 4,53,980 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 59,079 మందికి కంటి అద్దాల పంపణీ చేశారు. 30,851 మందిని చికిత్సలకు సిఫార్సు చేశారు. రెండో విడత కోసం సిద్దిపేట జిల్లాలో 45 టీములు ఏర్పాటు చేశారు. మూడు బఫర్ టీములు ఉంటాయి. ఒక్కో బృందంలో ఒక వైద్యాధికారి, ఒక అప్టోమెట్రిస్ట్, ఇద్దరు లేదా ముగ్గురు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ముగ్గురు ఆశ వర్కర్లు ఉంటారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేస్తారు. శిబిరానికి వెళ్లేవారు ఆధార్ కార్డు లేదా స్థానిక ధృవపత్రం తీసుకురావాల్సి ఉంటుంది.
సిద్దిపేట జిల్లాలో 45 బృందాలు ఏర్పాటు…
ఈనెల 19న ఉదయం 9 గంటలకు జిల్లాలో 45 బృందాలు ఒకే సారి కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాయి. శిబిరాల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. షామియానాలు, తాగునీరు, ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు, 115 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. మొత్తం జనాభా 11,30,840 ఉంది. ఇందులో 0-18 సంవత్సరాల జనాభా 3,39,252 మంది ఉన్నారు. కాగా టార్గెట్ జనాభా (18 ఏండ్ల పైబడిన వారు) 7,91,588 వీరందరికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందు కోసం కంటి పరీక్షలు నిర్వహించడానికి కంటి వైద్యులు ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 45 టీంలను ఏర్పాటు చేశారు. ఇవేకాకుండా బఫర్ టీంలు 3 (సిద్దిపేట-1, గజ్వేల్-1, హుస్నాబాద్-1) ఉన్నాయి. అర్బన్లో 11టీములు, రూరల్లో 34 టీములు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు క్యాంపు ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు (సోమవారం నుంచి శుక్రవారం) నిర్వహిస్తారు.
కళ్ల కలక
కళ్ల కలక వైరస్ లేదా బాక్టీరియా ద్వారా కళ్లకి కలిగే ఇన్ఫెక్షన్. కళ్లు బాగా ఎర్రబడి, నీళ్లు కారడం, కళ్ల మంటలు, కళ్లలో పొడుచుకుంటున్న బాధ, సరిగ్గా చూడలేకపోవడం ముఖ్య లక్షణాలు. ఇది ఒక అంటువ్యాధి. చేతి రుమాలు, తువ్వాలు ఒకళ్లు వాడినవి ఇంకొకళ్లు వాడడంతో వ్యాధి సోకినవారు ఇతరులతో చాలా దగ్గరగా ఉండడంతో తొందరగా వస్తుంది. వ్యాధి సోకినవారు గోరువెచ్చని నీళ్లతో తరుచూ కళ్లు కడగాలి. వీలైతే నల్లటి కళ్లజోడు ధరించాలి. చేతి రుమాలు, తుండుగుడ్డ ఇతరులవి వాడనీయకూడదు. డాక్టరు సలహాపై కళ్లలో మందు చుక్కలు వాడాలి.
రేచీకటి
ఇది మనం తీసుకునే ఆహారంలో విటమిన్-ఏ పాళ్లు తగ్గడంతో కలిగే కంటి సమస్య. మరికొందరికి ఇది రేటీనాకు వచ్చే ఆరోగ్య సమస్యలతో రావచ్చు. రాత్రిపూట కనిపించకపోవడం వంటి లక్షణాలుంటాయి. ఇక విటమిన్ -ఏ లోపం తీవ్రంగా ఉన్నవారిలో కార్నియా కరిగిపోయే పరిస్థితి వస్తుంది. దీన్నే వైద్య పరిభాషలో ‘కెరటోమలేసియా’ అంటారు. కంటిలో తడి ఆరిపోవడం, తెల్లగుడ్డపైన బూడిద రంగు మచ్చలు ఏర్పడటం వంటి లక్షణాలు ఉంటాయి. చివరి దశలో కార్నియా దెబ్బతిని అంధత్వం వస్తుంది. నివారణగా ప్రతి ఆరు మాసాలకొకసారి ఐయూ మిటమిన్ ఇస్తూ ఉండాలి. పాలు ఇచ్చే తల్లులకు ప్రసవం నుంచి తగిన మోతాదులో మిటమిన్-ఏ ఇవ్వాల్సి ఉంటుంది. మశూచి టీకాలు కూడా ఇప్పించడం ద్వారా కార్నియా సమస్యను నియంత్రించవచ్చు.
జిల్లా జనాభా : 11,30,840
0-18 సంవత్సరాల జనాభా: 3,39,252
టార్గెట్ జనాభా (18 ఏండ్ల పైబడినవారు): 7,91,588
జిల్లాలో ఏర్పాటు చేసే టీములు: 45
బఫర్ టీములు: 3 (సిద్దిపేట-1, గజ్వేల్-1, హుస్నాబాద్-1)
అర్బన్ టీములు: 11
రూరల్ టీములు: 34
జిల్లాలోని మొత్తం గ్రామ పంచాయతీలు: 499
జిల్లాలోని మున్సిపల్ వార్డులు: 115
క్యాంపు సమయం: ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు (సోమ-శుక్ర)
రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం
రెండో విడతపై మంత్రి హరీశ్రావు వీడియో కాన్ఫరెన్స్
కంటివెలుగు కార్యక్రమ ఏర్పాట్లపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఖమ్మం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈనెల 18న మధ్యాహ్నం ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. మరుసటి రోజు ఉదయం అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు స్థానిక ప్రజాప్రతినిధులు ఉదయం 9 గంటలకు ప్రారంభించాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కంటివెలుగు సెంటర్ వద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా ఒకరు లేదా ఇద్దరు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి సెంటర్ను రోజువారీగా సీపీ, ఏసీపీ, సీఐ, ఎస్సైలు పర్యవేక్షించాలన్నారు. ప్రతి సెంటర్లో రోజు సుమారు 120-130 మందిని టెస్టులు చేయాలన్నారు. ఉదయం 60-70 మందికి, మధ్యాహ్నం మరో 60-70 మందికి పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ తయారుచేసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రతి టీం ఉదయం 8.45 గంటలకు సెంటర్ వద్ద ఉండాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఉదయం 8 గంటలకే సెంటర్కు వెళ్లి ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. జిల్లా, మండలాల టీములు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రపంచంలోనే కంటి పరీక్షలు నిర్వహించే అతిపెద్ద కార్యక్రమం కంటివెలుగు అన్నారు. ఇది ఒక వైద్యారోగ్య శాఖ ఒక్కదానితో కాదని కలెక్టర్, మున్సిపల్, పంచాయతీ రాజ్, పోలీస్ అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. కంటి పరీక్షలు చేసిన వెంటనే అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. సైట్కి సంబంధిత అద్దాలను 10 రోజుల్లోగా ఆశ కార్యకర్తల ద్వారా అందివ్వాలని అధికారులను ఆదేశించారు. కంటివెలుగుపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ శ్వేత, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్, డీపీవో దేవకీదేవి, మున్సిపల్ కమిషనర్లు, వైద్యారోగ్య అధికారులు పాల్గొన్నారు.