కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరంది తెలంగాణ పచ్చబడ్డదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బీసీ బంధు పథకం కింద గజ్వేల్ పట్టణంలో రూ. లక్ష చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులవృత్తులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు సాగునీరు అందించి నేడు తెలంగాణ రాష్ర్టాన్ని ధాన్యాగారంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. బీడు భూముల్లో బంగారు పంటలు పండుతున్నట్లు తెలిపారు. ఇతర రాష్ర్టాల కూలీలు సైతం ఉపాధికోసం తెలంగాణ బాటపడుతున్నారని గుర్తుచేశారు. ఇదంతా సీఎం కేసీఆర్ మూడేండ్లలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనే సాధ్యమైందన్నారు. మెరుగైన వైద్యం అందుతుండడంతో ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. మూడు గంటల కరెంట్ కావాలంటున్న కాంగ్రెస్ కావాలా లేక మూడు పంటలు పండాలంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.
– గజ్వేల్, ఆగస్టు 11
గజ్వేల్, ఆగస్టు 11 : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మా ణం చేపట్టి, రైతులకు సాగునీరందించి నేడు తెలంగాణను దక్షిణ భారతానికి ధాన్యగారంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఆర్థిక, వైద్యారోగ్యల శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గజ్వేల్ పట్టణంలోని పీఎన్ఆర్ గార్డెన్లో శుక్రవారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బీసీబంధు పథకం ద్వారా లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరై 351మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇతర రాష్ర్టాల కూలీలు నేడు తెలంగాణతో ఉపాధి పొం దుతున్నారన్నారు. గతంలో పనికావాలని తిరిగే పరిస్థితి ఉంటే.. ప్రస్తుతం ఊర్లలో కైకిలోల్లు దొరుకుతాలేరన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ మూడేండ్లలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనే సాధ్యమైందన్నారు. గజ్వేల్లో గుం ట భూమి వృథా కాలేదని, ఇక్కడికి పంజాబ్, ఛత్తీస్గఢ్, యూపీకి చెందిన గుత్తేదారులొచ్చి పనులు పట్టుకుంటున్నారన్నారు.
సీఎం కేసీఆర్ లేకపోతే రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు వచ్చేవా అన్నారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీపై రాళ్లు వేసే ప్రయత్నం చేసిందన్నారు. సీఎం కేసీ ఆర్ రూ.20వేల కోట్ల రుణమాఫీ చేయాలని ఆదేశించారన్నారు. మూడు గంటల కరెంట్ కావాలంటున్న కాంగ్రెస్ కావాలా..? లేక మూడు పంటలు పండాలని ఉచిత కరెంట్ను అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కావాలా ఆలోచించాలన్నారు. బాయికాడ మీటర్లు పెట్టాలని చూస్తున్న బీజేపీని రైతు లు నమ్మరన్నారు. గజ్వేల్లో 100 పడకల దవాఖానను నెలరోజుల్లో ప్రారంభించుకుందామన్నారు. జూలైలో సర్కారు దవాఖానల్లో 72.82 శాతం ప్రసవాలు జరిగితే ప్రైవేట్లో 25 శాతం జరిగాయని, ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం కలిగిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, ఎఫ్డీసీ చైర్మన్ వంటే రు ప్రతాప్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవీరవీందర్, గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఎంపీపీ అమరావతి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు చంద్రమోహన్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మధు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. కులవృత్తిపై ఆధారపడ్డ కులాలకు రూ.లక్ష ఆర్థికసాయం అందించి వారిని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. గతంలో బీసీ కులాలకు రుణాలు ఇచ్చేవారని, బ్యాంకుల చుట్టూ తిరిగి ష్యూరిటీ పెట్టి తీసుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఎలాంటి ష్యూరిటీ లేకుండా ఉచితంగా లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని సీఎం కేసీఆర్ అందజేస్తున్నారన్నారు. బీసీ కులాల్లో అన్ని కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. గ్రామీణ వృత్తులకు జవసత్వాలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థకు ఉపిరిపోసే సంకల్పంతో సీం కేసీఆర్ ప్రభుత్వం యాదవులకు 75శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నదన్నారు. మాం సం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెంబర్వన్గా నిలిచిందన్నారు. చెరువుల్లో చేపల పెంపకం, తెలంగాణలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందడానికి మత్స్యకారులకు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి లభించేలా ఉచితంగా వందశాతం సబ్సిడీతో చేపపిల్లలను చెరువుల్లో పెంచుతున్నదన్నారు. గతంలో 19 గురుకులాలు ఉండగా, నేడు 310 గురుకులాలను చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేశామన్నారు.