మెదక్ రూరల్, అక్టోబర్ 21: జిల్లాలో పండుగ శోభ సంతరించుకుంది. సద్దుల బతుకమ్మ, విజయదశమిని పురస్కరించుకుని వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. మరో వైపు బంధువులు, ఆడబిడ్డల రాకతో ప్రతి ఇంట్లో సందడి వాతావరణం నెలకొన్నది. నేడు (ఆదివారం) సద్దుల బతుకమ్మ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా అధికారులు సర్వం సిద్ధం చేశారు. దసర పండుగ నేపథ్యంలో కొత్తబట్టలు, పిండి వంటలు, కిరాణ సామగ్రి కోనుగోళ్లతో జిల్లా కేంద్రంలో పలు షాపింగ్ మాల్స్ జనంతో కిటకిటలాడుతున్నాయి.
తెలంగాణలో జరుపుకొనే పర్వదినాల్లో బతుకమ్మ పండగకు ప్రత్యేక స్థానం ఉంది. పూలరూపంలో ప్రకృతిని పూజించే పండుగే బతుకమ్మ. తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన బతుకమ్మ వేడుకలను తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో ఘనంగా జరుపు కొంటున్నారు. పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలది. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగలిపూలు పేరు తో ఎంగలికాని, వాడని పూలతో పేర్చిన బతుకమ్మ తొమ్మిదో రోజు ఆదివారం సద్దుల బతుకమ్మతో ఆడబిడ్డల పండగ ముగియనున్నది. జిల్లా అంతటా శనివారం తంగేడు, గును గు, గడ్డి, చామంతి పువ్వుల అమ్మకాలు జోరుందుకున్నాయి. రద్దీతో ముఖ్యకూడళ్లు సందడిగా మారాయి. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఆడబిడ్డలు పుట్టింటికి వస్తారు. నిత్యం తీరొక్క రకాల పూలు సేకరించి కళాత్మకంగా బతుకమ్మను పేరుస్తారు. పసుపు ముద్దతో గౌరమ్మకు ప్రతి రూపం గా ప్రతిష్ఠిస్తారు.
పేద ధనికవర్గ, వయోభేదాలు లేకుండా మహిళంతా సాముహికంగా ఒకేచోట చేరి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ లయబద్దంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు. అంతేకాకుండా సద్దుల బతుకమ్మకు వేడుకలకు వచ్చే మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు జిల్లా కేంద్రంతో పాటు గ్రామా ల్లో అధికారులు ప్రజాప్రతినిధులు చెరువుల వద్ద లైట్లు, రహదారుల చదును చేయడం, రోడ్లపై గుంతలు పూడ్చడం, బారికేడ్లు ఏర్పాట్లు పూర్తి చేశారు.
బతుకమ్మ, దసర పండుగ సందర్భంగా మార్కెట్లో రద్దీ పెరిగింది. బంతిపూలు, గుమ్మడికాయలు, పూజ సామగ్రి అమ్మకాలు జరుపుతుండటంతో మార్కెట్లో పండుగ వాతావరణం నెలకొంది. వ్యాపారులు ధరలు పెంచి అమ్మకాలు జరుపుతున్నారు. విక్రయాల వద్ద కోనుగోలుదారులతో మార్కెట్లు కళకళలాడుతునాన్నాయి.
కొల్చారం, అక్టోబర్ 21: నేడు (ఆదివారం) కొల్చా రం మండల వ్యాప్తంగా జరగనున్న సద్దుల బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నా యి. బతుకమ్మ ఆట ఆడే స్థలాన్ని చదును చేయడంతో పాటు చెరువుల్లో నిమజ్జనం చేసేందుకు వెళ్లే దారిని, చెరువు గట్ల వద్ద డోజర్తో చదును చేయించారు. రంగంపేట, కొల్చారం గ్రామాల్లో చెరువు గట్టును చదును చేయించారు.