రామాయంపేట, మార్చి 2: రామాయంపేటలోని విజయలక్ష్మి మహిళా స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జీ)లో రూ.7.10 లక్షల రుణాలు పక్కదారి పట్టినట్లు వెలుగుచూసింది. విజయలక్ష్మి సంఘంలో 13 మంది సభ్యులున్నారు. వీరిలో 11 మంది ఈ రుణాలు చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో 11 మంది సభ్యులు శుక్రవారం మెదక్లో మెప్మా పీడీ ఇందిర కార్యాలయానికి వెళ్లి విషయాన్ని తెలిపారు. మెప్మా పీడీ ఇందిర ఎస్సీ కాలనీకి శనివారం వెళ్లి సమగ్ర విచారణ చేపట్టారు. ఈ విచారణలో ముగ్గురు మహిళల పేరిట రూ.7.10 లక్షలు జమైనట్లు బ్యాంకు వారు తమవద్ద ఉన్న రికార్డులు చూపించారు. శ్రీనిధి కింద ప్రభుత్వం మంజూరైన రూ.10 లక్షల్లో రూ.2.90 లక్షల పాత రుణం బకాయిలు పోగా, మిగిలిన రూ.7.10 లక్షలు మహిళా సంఘం సభ్యుల సహకారంతోనే బ్యాంకులో జమ చేశామని ఆర్పీ రజిత తెలిపారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ విజయలక్ష్మి సంఘంలో 13 మంది సభ్యులున్నారని, అందులో 11 మందికి రుణం చెల్లించాలని బ్యాంకు నోటీసులు జారీ చేసిందన్నారు.
సంఘంలో ముగ్గురు సభ్యుల్లో ఒకరి పేరిట రూ.1.10 లక్షలు, మరో ఇద్దరి పేరిట రూ.3 లక్షలు చొప్పున మొత్తం రూ.7.10 లక్షలు బ్యాంకులో జమైనట్లు రికార్డులు ఉన్నాయన్నారు. సభ్యుల్లో చనిపోయిన వారికి రుణాలు ఇవ్వకూడదన్నారు. కానీ, విజయలక్ష్మి సంఘంలో చనిపోయిన మహిళ పేరిట మృతురాలి కోడలుకు రుణం ఇచ్చారన్నారు. డబ్బులు ఎవరి పేరిట బ్యాంకులో పడితే వాటికి సంబంధించి లావాదేవీల బాధ్యత ఆ ఖాతాదారులపైనే ఉంటుందన్నారు. ఇందులో ఆర్పీ రజిత, ముగ్గురు సభ్యులు ఆ సంఘానికి సంబంధం లేకుండా డబ్బులు వాడుకున్నారన్నారు. ఆ డబ్బుల విషయంలో గోల్మాల్ జరిగిందని, వీరి నుంచి రికవరీ చేస్తామని పీడీ తెలిపారు. అకారణంగా 11 మందికి బ్యాంకు వారు ఇచ్చిన నోటీసులు క్యాన్సల్ చేయిస్తానని పీడీ భరోసా ఇచ్చారు. ఆర్పీ రజిత ఇతర సంఘాల నుంచి వాడుకున్న రూ.1.70 లక్షలు గుర్తించామన్నారు. ఆ మొత్తాన్ని కట్టాలని ఆమెకు ఆదేశించామన్నారు.