దుబ్బాక, అక్టోబర్ 31: బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి నిరసనలు వెల్లువెత్తాయి. మంగళవారం దుబ్బాక నియోజకవర్గంలో బంద్ పాటించారు. దుబ్బాక మున్సిపాలిటీతోపాటు దుబ్బాక, మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి , తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట , నార్సింగ్ మండలాల్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసి వేసి బంద్కు మద్దతు తెలిపారు. నియోజకవర్గంలో గ్రామగ్రామాన బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. మెదక్ ఎంపీ ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని సర్వత్రా ఖండించారు. దుబ్బాకలో వేకువజామున బస్ డిపో నుంచి బస్సులను బయటకు రాకుండా నిలిపివేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాలను స్వచ్ఛందంగా మూసి వేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు వ్యాపారులు, అభిమానులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.
దుబ్బాకలో హత్యా రాజకీయాలకు తెరలేపిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనీతాభూంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, ఆస యాదగిరి, వంశీకృష్ణగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూరంపల్లిలో ఎంపీ ప్రభాకర్రెడ్డిపై జరిపిన హత్యాయత్నాన్ని ఖండించాల్సింది పోయి కోడికత్తి డ్రామా అంటూ ఎమ్మెల్యే రఘునందన్ తన కార్యకర్తలతో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. దవాఖానలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఎంపీ ప్రభాకర్రెడ్డిని చూసి యావత్ తెలంగాణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ప్రభాకర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని సీఎం కేసీఆర్ , మంత్రులు కేటీఆర్, హరీశ్రావు తదితరులు సమీక్షించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారని గుర్తు చేశారు.
మెదక్ ఎంపీ ప్రభాకర్రెడ్డి చిన్న పేగు 10 సెంటీ మీటర్లు తొలగించినట్లు దవాఖాన వైద్యులు ప్రకటించినప్పటికీ దుబ్బాక ఎమ్మెల్యే తన అనుచరులతో విడ్డూరంగా మాట్లాడటం బాధాకరమన్నారు. దేశం కోసం.. ధర్మం కోసం అంటూ పదవిదాహంతో రఘునందన్ దుబ్బాకలో హత్యారాజకీయాలను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాక ఉపఎన్నిక నుంచి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ డ్రామాలు, విధ్వంసకర వాతావారణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇందుకు నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారకులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో దుబ్బాక ఎంపీపీ పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డి, స్వామి, కృష్ణ, శ్రీనివాస్, బీమాసేన, శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.