పుల్కల్, సెప్టెంబర్ 10: బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు నిండుకుండలా మారింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరదగా వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరిగింది. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 3248 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 29.211 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 3248 క్యూసెక్కులు అవుట్ ఫ్లో ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
అందులో విద్యుత్ ఉత్పత్తికి 2783 క్యూసెక్కులు, హెచ్ఎండబ్ల్యూఎస్కు 80 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 70 క్యూసెక్కులు, ఈవీపీ 315 క్యూసెక్కులు వెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో సందర్శకులను డ్యాం పైకి అనుమతించడం లేదు. నీటి పారుదల శాఖ ఆదేశాల మేరకు 2783 క్యూసెక్కుల నీరు విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 7.5 మెగా వాట్ల సామర్థ్యం గల రెండు టర్బైన్ల ద్వారా 3.1 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఏడీ కుర్మి పాండయ్య తెలిపారు.