పటాన్చెరు టౌన్, మే 31 : ‘అబద్ధ్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజాపాలనను ఏనాడో గాలికొదిలేసి రాష్ట్రంలో పర్సంటేజీల పాలనను కొనసాగిస్తున్నది’ అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎర్రోళ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కన్వెన్షన్ సెంటర్ మొత్తం గులాబీమయంగా మారింది.
మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు వెంకటేశంగౌడ్, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్గౌడ్, మాజీ కార్పొరేటర్ అంజయ్యయాదవ్, పటాన్చెరు మాజీ జడ్పీటీసీలు కొలను బాల్ రెడ్డి, సుప్రజావెంకట్రెడ్డి, బీఆర్ఎస్ గుమ్మడిదల మండల అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, మేరాజ్ఖాన్ తదితరులు సమావేశంలో మాట్లాడారు. పటాన్చెరు మాజీ కార్పొరేటర్ శంకర్యాదవ్ ‘వీరులారా వందనం….’‘ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా..’ పాటలు పాడి అందరినీ ఉత్సాహపరిచారు. కార్యక్రమం చివరలో గులాబీల జెండలమ్మ అనే పాటపై నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ కండువాలు ఊపుతూ ఉత్సాహంగా డ్యాన్స్లు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్న్లు జనార్దన్, సుష్మా, ప్రమీల, సుమలత, మాజీ చైర్మన్లు పాండురంగారెడ్డి, రోజాబాల్రెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్రెడ్డి, దేవానంద్, శ్రీశైలంయాదవ్, యాదగిరి యాదవ్, మాజీ వైస్ చైర్మన్ నరసింహాగౌడ్, నాయకులు సోమిరెడ్డి, విజయ్కుమార్, నర్రా భిక్షపతి, శ్రీధర్చారి, గడీల కుమార్గౌడ్, హన్మంత్రెడ్డి, పృథ్వీరాజ్, మహిళా నాయకురాలు గూడెం యాదమ్మ, కల్పన, కాట సునీత, కౌన్సిలర్లు, డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ అబద్ధ్దాలపై పాలన కొనసాగిస్తున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇండ్ల కూల్చివేతలు, రైతుల రోదనలు, నిరుద్యోగుల ఆక్రందనలు, హామీల ఎగవేతల మీద పాలన కొనసాగుతున్నదని దుయ్యబట్టారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలోని తొమ్మిది డివిజన్లలో బీఆర్ఎస్ జెండాను ఎగరేసి కేసీఆర్కు గిఫ్ట్గా ఇస్తామని ఎమ్మెల్యే అన్నారు. పరిశ్రమలు, బిల్డర్ల నుంచి వచ్చే సీఎస్ఆర్ ఫండ్ స్థానికంగా ఖర్చు చేయాలని, లేదంటే కలెక్టరేట్ను ముట్టడిస్తామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు గర్వపడేలా పార్టీని పటిష్టం చేస్తామన్నారు.

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించబోతున్నామని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, వారికి అండగా ఉంటామన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను మూడు సార్లు ఎగరవేయడంతో పాటు ఏ ఎన్నికలు వచ్చిన గులాబీదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. ఐదు మున్సిపాలిటీలను స్వీప్ చేసినట్లుగానే తొమ్మిది డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పటాన్చెరు నియోజకవర్గంలో నిరుపేదలకు కాలరాత్రులు మొదలయ్యాయని అన్నారు. హైడ్రా పేరుతో పేదోడి గుడిసెల పైకి బుల్డోజర్లను పంపిస్తూ, వారి జీవితాలను ఆగమాగం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అన్నారు.
– పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ధ్వజం
ఇరవై ఐదేండ్ల పార్టీ భవిష్యత్తు ఈ మీటింగ్కు 300 మంది వస్తారనుకుంటే మూడు వేల మంది వచ్చారని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదులో పటాన్చెరు నియోజకవర్గం ఒక మోడల్గా నిలవాలని పిలుపునిచ్చారు. లక్షా ముప్పై వేల సభ్యత్వాలు చేసి పార్టీ అధ్యక్షులు కేసీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు వద్ద మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. డివిజన్లు, మున్సిపాలిటీలు, మండలాల్లో రేపటి నుంచే సభ్యత్వ నమోదుకు సంబంధించి పని ప్రారంభించాలని సూచించారు. ఎస్ఐఆర్ రాబోతోందని, కొత్త ఓట్లు చేర్చుకోవడంతో పాటు పాత ఓట్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నా రు. సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న మొట్టమొదటి సమావేశం ఇది అని, పటాన్చెరు నియోజకవర్గంలో ఐదు మున్సిపాలిటీలు గెలుపొంది కాంగ్రెస్కు, జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులకు సరైన బుద్ధిచెప్పామన్నారు.
వడ్లు కొంటలేరని, ఆరు గ్యారెంటీల అమలు ఊసేలేదన్నారు. పూర్తిగా పంట రుణమాఫీ చేయలేదన్నారు. నాలువేల పెన్షన్, మహిళలకు 2500 ఇవ్వ డం లేదన్నారు. ఉద్యోగాల మాటే లేదని, అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎర్రోళ్ల శ్రీనివాస్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ మీటింగ్ల్లో కార్యకర్తలే వారిని తిడుతున్నారని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్త చేశారు. అందరం అప్రమత్తంగా ఉండాలని, ఏ ఊరికి వారే కథానాయకులు కావాలన్నారు. కాంగ్రెస్ అరాచకాలపై గొంతెత్తి మాట్లాడాలన్నారు. వారి అబద్ధాలు, మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు కింద క్యాడర్ లేదని, పైన సరైన నాయకుడు లేడన్నారు. మూడు పార్టీలు తిరిగిన వ్యక్తి సీఎం రేవంత్రెడ్డి అని, మైకు ఇస్తే మేము కూడా పొట్టుపొట్టు తిడుతం, కానీ.. మాకు సంస్కారం ఉందని, జీహెచ్ఎంసీలో గెలుపు మాదే అని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.
– ఎర్రోళ్ల శ్రీనివాస్
పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలుపుతూ.. ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కేసీఆర్, హరీశ్రావు సరసన నిలిచారు. బీఆర్ఎస్కు బలమైన క్యాడర్గా పటాన్చెరును తయారు చేశారు. ఎన్నికలు ఏవైన గెలిచేది బీఆర్ఎస్ మాత్రమే.
– మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్
రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకాలు ఎక్కువయ్యాయి. పార్టీ విషయంలో రెండున్నరేండ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. వాటిని అదిగమించి ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ను గెలిపించుకున్నాము. పటాన్చెరు అంటే బీఆర్ఎస్ అడ్డా. కాంగ్రెస్కు బుద్ధి చెప్పాము. నేను అంటే ఓటమికి దారి..మనం అంటే విజయానికి దారి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలి. పార్టీ ఉంటేనే మనం ఉంటాం. పార్టీ వీక్ అయితే మనం వీక్ అవుతాము. సభ్యత్వ నమోదులో యువతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. లక్ష్యం మేరకు డిజిటల్ సభ్యత్వ నమోదు చేసి కేసీఆర్, హరీశ్రావు వద్ద పటాన్చెరు పేరు నిలబెట్టాలి.
– ఆదర్శ్ రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ కో ఆర్డినేటర్