సిటీబ్యూరో, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా నివాస గృహాల విక్రయాలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇండ్లు, ఫ్లాట్లు మొదలైన వాటి లావాదేవీ మెరుగైనట్టు దానికి సంబంధించిన వృద్ధిరేటు చెబుతోంది. ఇందుకు సంబంధించి గడిచిన 11 నెలల కాలంలోనే 16 శాతం వృద్ధి రేటు నమోదైనట్టు ‘నైట్ ఫ్రాంక్’ సర్వే వెల్లడించింది. జనవరి నుంచి నవంబర్ 2021 మధ్య కాలంలో హైదరాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని అపార్టుమెంట్లలో 21988 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర స్టాంప్స్ అండ్స్ రిజిస్ట్రేషన్స్ శాఖలో జరిగిన సేల్ డీడ్లను పరిగణనలోకి తీసుకొని సర్వే నివేదికను రూపొందించారు. మూడు జిల్లాల పరిధిలోనే 50 లక్షల బడ్జెట్తో కూడిన అపార్టుమెంట్ ఫ్లాట్లు 66 శాతం వరకు 11 నెలల్లోనే జరిగాయి. కేవలం హైదరాబాద్ జిల్లా పరిధిని తీసుకుంటే 58 శాతం అమ్మకాలు జనవరి నుంచి నవంబర్ వరకు జరిగాయని నివేదికలో పేర్కొన్నారు.
మూడు నెలలుగా.. పెరుగుదల
గతేడాది మార్చితో మొదలైన కరోనా మహమ్మారి ప్రభావం గ్రేటర్ హైదరాబాద్పై చూపింది. అయితే, నెలల వారీగా చూసినట్లయితే కొన్నిసార్లు తగ్గినా, మళ్లీ అమ్మకాలు పెరుగుతూ వచ్చా యి. ఆగస్టు తర్వాత నుంచి కరోనా ప్రభావం తగ్గడంతో మార్కెట్లోనూ నివాస గృహాల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. అందుకు నిదర్శనం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కలను బట్టి వెల్లడైంది. 2021లో వరుసగా మూడు నెలలుగా నివాస గృహాల కొనుగోలు రియల్ ఎస్టేట్ మార్కెట్కు ఊతమిచ్చాయి. ప్రాజెక్టు సైట్ల వద్ద పెరుగుతున్న విచారణలు ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.
నివాస గృహాల కొనుగోలుకు హైదరాబాద్ ఆకర్షణీయం
దేశంలోని మెట్రో నగరాల్లో గృహాల కొనుగోలులో హైదరాబాద్ నగరం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కరోనా సమయంలోనూ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా మహరాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్లో రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంప్ డ్యూటీని తగ్గించినా, ఇక్కడ మాత్రం తగ్గించకుండా ప్రభుత్వం పెంచింది. అయినా, ఇక్కడే నివాస గృహాల కొనుగోళ్లు పెరిగాయి.