టేక్మాల్, డిసెంబర్ 1 : వివాహిత మహిళపై అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామానికి చెందిన వరాల సంగమ్మ (45) అక్టోబర్ 16న సాయంత్రం కల్లు దుకాణానికి వెళ్లింది.
ఆ సమయంలో అక్కడే ఉన్న కుర్మ ఈశ్వరయ్య ఆమెను చేయి పట్టుకుని దుకాణం వెనకాలకు లాక్కెళ్లాడు. అత్యాచారం చేయడంతో పాటు క్రూరంగా ప్రవర్తించి గాయపరిచాడు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో ఆమె ఎవరికి చెప్పకుండా మిన్నకుండిపోయింది. అయితే ఆమె పట్ల ప్రవర్తించిన తీరుతో అనారోగ్యానికి గురై గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతుంది.
దవాఖానలో చికిత్స చేయించుకున్న నయం కాలేదు. ఆరోగ్య సమస్య తీవ్రం కావడంతో జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం జోగిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జార్జ్, ఎస్సై నాగరాజు తెలిపారు.