సిద్దిపేట రూరల్, ఏప్రిల్ 19: ఎండలు మండిపోతుండటంతో ప్రజలు భానుడి తాపానికి ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండలు విపరీతంగా కొడుతుండటంతో ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఉదయం నుంచే ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నందున ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నందున ప్రజలు ఎండలో ఎక్కువ తిరగకూడదు. అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే గొడుగులు, తలపై క్యాపులు, స్క్రాప్లు ధరించాలని తెలియజేస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నందున ప్రజలు సరైన జాగ్రత్తలు పాటించాలి. శరీరానికి అవసరంపడే నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలకు నీటిని ఎక్కువగా తాగడంతో పాటు పండ్లను తరుచూ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు కొబ్బరిబొండాం, నిమ్మరసం, చెరుకురసం, పండ్లు తీసుకోవడంతో పాటు ఓఆర్ఎస్ను తాగితే మంచిదని చెబుతున్నారు. ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ప్రజలు సరైన జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందని ప్రముఖ వైద్యుడు ఉదయ్కుమార్ తెలిపారు.
ఎండలో ఎక్కువగా తిరిగితే కండ్లకు అలసట వస్తుంది. అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే కండ్లజోడు తప్పక ధరించాలి. తరచూ చల్లని నీటితో కండ్లను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వేడి గాలికి కూడా కండ్లజోడు కండ్లకు రక్షణగా పనిచేస్తాయి.
ఎండకాలంలో సాధారణంగా చర్మ సంబంధ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఎండకాలంలో శరీర పరిశుభ్రత ముఖ్యం, రెండు పూటలా స్నానం చేయాలి. ఉతికిన బట్టలే ధరించాలి.
ఎండలు తీవ్రరూపం దాల్చినందున ఎండ వేడిమినుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు తరుచూ నీటిని తాగాలి. సాధ్యమైనంత వరకు ఎండలో తిరుగకూడదు. అత్యవసర పరిస్థితిలో గొడుగు, లేదా క్యాపులు వాడాలి. ఎండలో తిరగాల్సిన పరిస్థితి వస్తే కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు నీటిలో కలిపి తాగడం ఉత్తమం. పండ్లను బాగా తీసుకోవాలి.
– డాక్టర్ ఉదయ్కుమార్, పుల్లూరు పీహెచ్సీ