సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 4: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్షా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలో ఆదివారం పోలీసు శాఖ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించింది. పట్టణంలోని అంబేద్కర్ మైదానంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, కలెక్టర్ డాక్టర్ శరత్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పోలీసు పెట్రోలింగ్ కార్లు, బ్లూ కోర్ట్ వాహనాలు, ట్రాఫిక్ వాహనాలతో అంబేద్కర్ మైదానం నుంచి మొదలైన ర్యాలీ కొత్త బస్టాండ్, ఐబీ మీదుగా బైపాస్ రోడ్డులోని బసవేశ్వర చౌక్, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, కలెక్టరేట్ మీదుగా కొనసాగింది. ర్యాలీతో పాటు కళాకారుల ఆటాపాట ఆకట్టుకున్నాయి. షీ టీమ్, భరోసా సిబ్బంది ప్రదర్శనలకు ప్రజలు మంత్రముగ్దులయ్యారు. ఒకపక్క వర్షం పడుతున్నప్పటికీ సురక్షా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ రమణకుమార్, అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమాన్ని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ గతంలో ఉన్న పోలీసు వ్యవస్థ, ప్రత్యేక రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థకు తేడాను వివరించారు. ఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ పోలీసు శాఖ సాధించిన విజయాలను వివరించారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ శరత్, టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్రావు, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి పాల్గొన్నారు.