వెల్దుర్తి, అక్టోబర్ 21 : ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని వారి మెడలోని ఆభరణాలను దోచుకుంటున్న యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్దుర్తి ఎస్సై మహేందర్ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో వివరాలను మీడియాకు వెల్లడించారు.
గత నెల సెప్టెంబర్ 11న మండలంలోని మంగళపర్తిలో వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గుండ్లు, అదే రోజు మధ్యాహ్నం వెల్దుర్తి శివారు దేవతల చెరువు వద్ద వెల్దుర్తికి చెందిన మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును చోరీ చేశాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా బుధవారం వెల్దుర్తి శివారులో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా మాసాయిపేట మండలం బొమ్మారం గ్రామానికి చెందిన నవీన్(24) అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పట్టుకొని విచారించగా పై చోరీలకు పాల్పడింది తానేనని అంగీకరించాడననారు. అతడి వద్ద నుంచి ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు.