సంగారెడ్డి జూన్ 3 (నమస్తే తెలంగాణ): జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈవీఎం ఓట్లను నియోజకవర్గాల వారీగా లెక్కిస్తారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఏడు నియోజకవర్గాలకు 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. కనిష్టంగా 19 రౌండ్ల నుంచి గరిష్టింగా 23 రౌండ్ల వరకు ఓట్ల లెక్కించనున్నారు.
జహీరాబాద్ పార్లమెంట్కు 1973 పోలిం గ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగ్గా 74.63 శాతం పోలింగ్ నమోదైంది. 12,25,049 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొదట జుక్కల్, బాన్సువాడ ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి. జుక్కల్లో 255 పోలింగ్ కేంద్రాలకు 14 కౌంటింగ్ టేబుళ్లు, 19 రౌండ్లు ఓట్లు లెక్కించనున్నారు. బాన్సువాడలోని 258 పోలింగ్ కేంద్రాలకు 14 కౌంటింగ్ టేబుళ్లలో 19 రౌండ్లు ఓట్లు లెక్కిస్తారు. ఎల్లారెడ్డిలో 270 పోలింగ్ కేంద్రాలకు 14 కౌంటింగ్ టేబుళ్ల ద్వారా 20 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. కామారెడ్డికి సంబంధించి 266 పోలింగ్ కేంద్రాలకు 14 కౌం టింగ్ టేబుళ్లలో 19 రౌండ్లు ఓట్లు లెక్కిస్తారు. నారాయణఖేడ్లో 296 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లలో 22 రౌండ్లలో ఓట్లు లెక్కింపు పూర్తవుతుంది. అందోలులో 313 పోలింగ్ కేంద్రాలకు సంబందించి 14 టేబుళ్లలో 23 రౌండ్లు ఓట్లు లెక్కింపు జరుగుతుంది. జహీరాబాద్కు సంబంధించి 14 టేబుళ్ల ద్వారా 23 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. ఓట్ల లెక్కించే టేబుళ్ల వద్ద ఒక సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, ఏఆర్వోలు ఉంటారు. ఎన్నికల పరిశీలకులు గోపాల్ జి.తివారీ, ప్రదీప్సింగ్ సంగ్వాత్ పర్యవేక్షణలో ఓట్ల లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గీతం యూనివర్సిటీ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.