గజ్వేల్, ఫిబ్రవరి 22 : గడిచిన నాలుగేండ్లలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహకారంతో గజ్వేల్ మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చెందిందని, బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశామని మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ బడ్జెట్ను ప్రవేశపెట్టగా, పాలకవర్గ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్తో కలిసి ఎన్సీ రాజమౌళి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2024-25 వార్షిక బడ్జెట్ అంచనా రూ.18.06 కోట్లు కాగా, సొంత ఆదాయం అంచనా రూ.13.44 కోట్లు, గ్రాంట్ల ద్వారా ఆదాయం అంచనా రూ.4.62 కోట్లు, గ్రీన్ బడ్జెట్ రూ.1.73 కోట్లు, కొత్తగా విలీనమైన ప్రాంతాల్లో క్లిష్టమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.0.64 కోట్లను ప్రవేశపెట్టామని వివరించారు.
వివిధ కేటగిరీలవారీగా ఆదాయ అంచనాలు రూ.12.97 కోట్లు, వివిధ కేటగిరీలవారీగా కేటాయింపులు రూ.13.16 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టామన్నారు. ఇందులో రూ.27.86 కోట్లు మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టామని చెప్పా రు. రాష్ట్రంలోని 144 మున్సిపాలిటీల్లో గజ్వేల్ను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశామన్నారు. గతంలో గజ్వేల్ మున్సిపాలిటీకి అవార్డులు వచ్చాయని, అందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో సహకరించిందన్నారు. రూ.100 కోట్లతో యూజీడీ పనులను పూర్తిచేశామని, పారిశుద్ధ పనులు, వీధిలైట్ల ఏర్పాటు, డం పింగ్యార్డు నిర్మాణం, హరితహారంలో మొ క్కల పెంపకం చేపట్టామన్నారు. మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, అధికారులు పాల్గొన్నారు.