మెదక్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన, ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ కోసం కార్యక్రమాన్ని చేపట్టిందని, అందుకోసం జిల్లా వ్యాప్తంగా అధికారులు సిద్ధంగా ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్, జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గం, మండల, గ్రామస్థాయిలో ప్రత్యేకాధికారుల బృందాలను నియమించాలన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా తదితర పథకాలు (ఆరు గ్యారెంటీ)ల కోసం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు అందించడం కోసం ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. దరఖాస్తుదారుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, వారికి కావాల్సిన కుర్చీలు, టెంట్లు, తాగునీరు, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ఒకరోజు ముందు గ్రామాలు, వార్డుల్లో దండోరా వేయించాలన్నారు. కార్యక్రమాలు నిర్వహించబోయే తేదీలు, సమయాలను ముందస్తుగా ప్రజలకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 25 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందని, జిల్లా వ్యాప్తంగా అధికారులు గ్రామ సభల నిర్వహణకు అన్నిఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. నియోజకవర్గం, మం డల, గ్రామస్థాయిలో ప్రత్యేకాధికారుల బృందాలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. పంచాయతీ స్థాయిలో ప్రత్యేకాధికారిని ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామసభలో ఏర్పాటు చేసిన ప్రతి కౌంటర్కు ప్రజాపాలన బోర్డు ఉండాలన్నారు. జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు అందించడం కోసం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. గ్రామ సభలు సజావుగా జరగాలని, ఆయా అధికారులు, బృందాలు ఎలాంటి అలసత్వం వహించవద్దన్నారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా స్వీకరించాలన్నారు. సమన్వయంతో పని చేసి జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంచేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీవో శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో సురేశ్మోహన్, డీఆర్వో నగేశ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.