సిద్దిపేట, మార్చి 2: మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత లోపం ఎక్కువగా ఉందని, క్షేత్రస్థాయిలో పీహెచ్సీల వై ద్యసిబ్బంది వారికి పోషకాహారం తీసుకోవడంపై అవగాహన కల్పించాలని సిద్దిపేట కలెక్టర్ మికిలినేని మను చౌ దరి సూచించారు. శనివారం ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యక్రమాల ప్రగతి నివేదికను డీఎంహెచ్వో కాశీనాథ్ కలెక్టర్కు వివరించారు. జిల్లా ఆరోగ్య సమన్వయకర్త డాక్టర్ సాయికిరణ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు, విధానాల గురించి తెలిపారు. జిల్లా దవాఖాన వైద్యసేవల గురించి సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్కుమార్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతృ మరణాలపై థర్డ్ పార్టీ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు.
టీబీ కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. టీ-డయాగ్నోస్టిక్ హబ్ సేవలు మెరుగుపర్చాలని, జిల్లా దవాఖానలో హెల్ప్డెస్క్ పటిష్టం చేయాలని, వైద్యుల రోస్టర్ జాబితాను అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఆదేశించారు. ఎంసీహెచ్లో కాన్పు లు మెరుగుపర్చాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు, సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం పల్స్పోలియో కార్యక్రమ వాల్పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమీక్షలో డిప్యూటీ డీఎంహెచ్వోలు, లైసన్ అధికారులు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.