మునిపల్లి, జూన్ 18: గత ప్రభుత్వాల హయాంలో తాగు నీటికి అనేక తిప్పలు పడ్డామని, తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ పాలనలో ఇంటి ముందుకే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని బుసారెడ్డిపల్లిలోని మిషన్ భగీరథ పంపు హౌస్ వద్ద మంచి నీళ్ల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాల తీరుతో ఆనాడు పడ్డ కష్టాలను మళ్లీ రానివ్వబోమన్నారు. మిషన్ భగీరథ పథకంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగు నీరు అందిస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 ఏండ్లు పడ్డ కష్టాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నాలుగేండ్లలో తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలు దగ్గర ఉండి చూసిన వ్యక్తిగా, ఆ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా సీఎం ముందుకు సాగుతున్నారన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి క్రమం తప్పకుండా అందిస్తున్నారన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నసింగూరు ప్రాజెక్టు నీళ్లు తాగేందుకు, వ్యవసాయానికి వాడుకునేందుకు ఒక్క చుక్క ఇవ్వలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మన నీళ్లు మనం వాడుకుంటున్నామన్నారు. సింగూరు ప్రాజెక్టు నిర్మాణంలో జీవితాలు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారని, వారు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి బుక్కెడు నీళ్లు కూడా వాడుకోలేదని, తెలంగాణ ఏర్పడి, కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే నీళ్లు వాడుకుంటున్నామని చెబుతుంటే కడుపు నిండినట్లు అనిపిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ చొరువతో సింగూరు నీళ్లు వినియోగించుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, మునిపల్లి ఎంపీపీ శైలజా శివశంకర్, జడ్పీటీసీ మీనాక్షీ సాయికుమార్, మునిపల్లి తహసీల్దార్ శివకుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సాయికుమార్, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్కుమార్, ప్రధానకార్యదర్శి శశికుమార్, సర్పంచ్లు స్వప్నాశికుమార్, రమేశ్ ఉన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నీళ్లుండవు అన్నోళ్లు నోర్లు మూసుకునేలా సీఎం కేసీఆర్ చేసిండు. ప్రత్యేక చొరవతో అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి చూపించిండు. సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడంలో సీఎం కేసీఆర్కు ఎదురేలేదు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొనసాగుతున్న గుజరాత్లో వారానికి ఒక రోజు నీళ్లొస్తే, తెలంగాణలో రోజూ నీళ్లొస్తున్నాయి. రాష్ట్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజల అండదండలు కావాలి. సీఎం కేసీఆర్ చొరవతో గడపగడపకూ సురక్షితమైన నీరందుతున్నది.
– చింతా ప్రభాకర్, హెచ్డీసీ చైర్మన్
డబ్బాల్లో కొన్న తాగు నీటి కన్నా మిషన్ భగీరథ నీళ్లే సురక్షితమైనవి. తాగునీటి సమస్యపై ఆ రోజుల్లో ఎలా ఉండేది.. నేడు ఎలా ఉందో గమనించాలి. గతంలో నీటి సమస్య ఉన్న రోజుల్లో గ్రామాల్లో పర్యటించేందుకు ఇబ్బందులు పడేవాళ్లం. ఎంత ఖర్చు పెట్టినా తాగు నీటి సమస్య పరిష్కారమయ్యేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ మంచి నీళ్లు అందించడం సంతోషంగా ఉంది. సంగారెడ్డి జిల్లాలోని 943 గ్రామాల్లో 907 తాగు నీటి ట్యాంకులు నిర్మించాం. రూ.1688 కోట్లతో 3 వేల కిలోమీటర్ల దూరం పైపులైన్ నిర్మించి, 2.88లక్షలకు పైగా నల్లా కనెక్షన్లు ఇచ్చాం. ప్రతి ఒక్కరూ నీరు ఆదా చేయాలి.
– శరత్, సంగారెడ్డి కలెక్టర్
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఆడపిల్లల కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథ పథకం ప్రవేశ పెట్టిండు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల సమస్యలు గమనించిన సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముందుగా మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టి మహిళల నీటి కష్టాలు తీర్చిండు. అప్పట్లో ట్యాంకర్ల దగ్గర, బోరు మోటర్ల దగ్గర లైన్లు నిలబడి బిందెడు నీళ్లు తెచ్చుకునేవాళ్లం. నేడు మంచినీళ్ల సప్పుడే నిద్రలేపుతున్నది. సొంతింటి మనిషి లెక్క సీఎం కేసీఆర్ మనకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తోడుంటున్నారు.
– మంజుశ్రీజైపాల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్, సంగారెడ్డి
తెలంగాణలోని ప్రజల సమస్యలను ఇంటి పెద్దగా పరిష్కరిస్తూ, కంటికి రెప్పాలా కాపాడుకుంటున్న ఒకే ఒక వ్యక్తి సీఎం కేసీఆర్. గతంలో ఎమ్మెల్యేలు సింగూరు నీళ్లు కావాలని మొరపెట్టుకున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత అపార భగీరథడు సీఎం కేసీఆర్ కృషితో మన నీళ్లు మనం వాడుకుంటున్నాం. నేను చిన్నగున్నప్పుడు మా చుట్టాల వద్దకు వెళ్లాలంటే భయమయ్యేది. ఇప్పుడు కేసీఆర్ పుణ్యమా అని చుట్టాల వద్దకు దర్జాగా వెళ్తున్నాం.
– మాణిక్రావు, ఎమ్మెల్యే జహీరాబాద్