మునిపల్లి, ఫిబ్రవరి 23: తెలంగాణ రాష్ట్రంలోనే సింగూరు ప్రాజెక్టుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే సందర్శకుల సంఖ్య మరింత పెరగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. వానకాలం ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చే సమయంలో ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్దఎత్తున ప్రాజెక్టు వద్దకు వస్తారు. బోటింగ్ సౌకర్యం కూడా ఉండడంతో ప్రాజెక్టులో బోటింగ్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపేవారు. అయితే, బోట్ చిన్నగా ఉండడంతో పర్యాటకులు బోటింగ్కు ఆసక్తి చూపడం లేదు. కొంతకాలంగా బోట్ పాడవడంతో ప్రస్తుతం బోటింగ్ను నిలిపివేశారు. అయితే, చిన్నబోట్ స్థానంలో ఎక్కువ మంది ప్రయాణించేలా పెద్దబోట్ ఏర్పాటు చేయడంతో పాటు పురాతన విగ్రహాల తోటను తీర్చిదిద్దితే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశంఉంది.
పురాతన విగ్రహాల తోటను అభివృద్ధి చేస్తే…
మండలంలోని బుసారెడ్డిపల్లి గ్రామ శివారులో సింగూరు ప్రాజెక్టును వీక్షించేందుకు వచ్చే వారి కోసం ప్రభుత్వం తెలంగాణ హరిత రెస్టారెంట్ను ఏర్పాటు చేసింది. రెస్టారెంట్ పక్కన 2013లో అప్పటి ప్రభుత్వం పురాతన విగ్రహాల తోటను ఏర్పాటు చేసి దాని అభివృద్ధిని గాలికొదిలేసింది. దీంతో ప్రాజెక్టు సందర్శనకు వచ్చే ప్రజలు కేవలం ప్రాజెక్టును చూసి తిరిగి వెళ్లిపోతుండగా, పురాతన విగ్రహాల తోటను వినియోగంలోకి తీసుకువస్తే మరింత ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుందని స్థానికులతో పాటు పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రత్యేక చొరవ తీసుకొని పురాతన విగ్రహాల తోటను వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
200లకు పైగా విగ్రహాలు
పురాతన విగ్రహాల తోటలో 2013లో అధికారులు 200లకు పైగా పురాతన విగ్రహాలను తీసుకువచ్చి తోటలో ఉంచి ఓ పార్క్ల ఏర్పాటు చేశారు. విగ్రహాల తోట ఏర్పాటు చేసినప్పటి నుంచి నేటి వరకు వాటి అభివృద్ధి పట్టించుకున్న నాథుడే లేడు. అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ దృష్టి సారించి అభివృద్ధి చేసి పర్యాటకుల కోసం అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ హరిత రెస్టారెంట్
పర్యాటకుల బోటింగ్ (ఫైల్)
విగ్రహాల తోటను వినియోగంలోకి తేవాలి
విగ్రహాల తోటను ప్రభుత్వం వినియోగంలోకి తెస్తే సింగూరు ప్రాజెక్టును వీక్షించేందుకు వచ్చే పర్యాటకులకు మరింత ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారుతుంది. హరిత రెస్టారెంట్లో సేదతీరిన అనంతరం పరిసర ప్రాంతాల్లో చూడదగిన మరే ప్రదేశాలు లేకపోవడంతో ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహాల తోటను వినియోగంలోకి తెస్తే పర్యాటకులతో తోట సందడిగా మారే అవకాశాలున్నాయి. – స్వప్నశశికుమార్, సర్పంచ్, బుసారెడ్డిపల్లి
అదనపు బోటింగ్ను ప్రారంభించాలి
సింగూరు ప్రాజెక్టులో చిన్న బోట్తో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఎక్కువ మంది కూర్చునేలా పెద్ద బోటు ఏర్పాటు చేస్తే మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. బోటింగ్ ఉన్నప్పుడు పర్యాటకులు అధిక సంఖ్యలో ప్రాజెక్టును వీక్షించేందుకు వచ్చేవారు.ప్రస్తుతం చిన్న బోట్ ఏర్పాటు చేయడంతో ఎవరూ ఆసక్తి చూపకపోగా, పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మళ్లీ బోటింగ్ను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి.
– ఉల్లిగడ్డల శివకుమార్, ఎంపీటీసీ, మల్లికార్జునపల్లి