అంసతృప్తులు.. రాజీనామాలు.. ఆందోళనలతో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. పార్టీలో తమకు ప్రాధాన్యం, గౌరవం లేదంటూ గ్రామ, మండలం, జిల్లాస్థాయి నాయకులు, కార్యకర్తలు రాజీనామాలు చేస్తుండడం కలవరం సృష్టిస్తున్నది. కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ ఇప్పటివరకు కాంగ్రెస్ తమ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించకపోవడంతో కిందిస్థాయి క్యాడర్ అయోమయంలో పడిపోయారు. మరోవైపు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న హస్తం నేతలు మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు.
ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి రాజీనామా చేసి మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరగా, ఆయన అనుచరులు సైతం కాంగ్రెస్ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు అసంతృప్తులు జిల్లా నాయకులతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. వరుస చేరికలతో బీఆర్ఎస్లో జోష్ పెరిగింది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఇంటింటికీ ప్రచారం కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు.
-మెదక్ (నమస్తే తెలంగాణ) , అక్టోబర్ 11
మెదక్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. కాం గ్రెస్ పార్టీలో ఉన్న అసమ్మతి ఒకో గ్రామంలో క్రమంగా బయటపడుతున్నది. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో లీడర్లు, కార్యకర్తలు పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో గౌరవం దకడం లేదని, ప్రాధాన్యం లభించడంలేదని మండలస్థాయి నేతల వద్ద పరిస్థితిని ఏకరువు పెడుతున్న కొంతమంది లీడర్లు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అనుచరులతో కలిసి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
కారులో పెరుగుతున్న జోష్..!
నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలతో జోష్ పెరుగుతు న్నది. గ్రామ, మండల, నియోజకవర్గస్థాయి నేతలు సైతం బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. మెదక్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిని ఇప్పటికే సీఎం కేసీఆర్ మెదక్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. పద్మాదేవేందర్రెడ్డి నియోజకవర్గంలో అన్నీతానై పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ప్రజలు, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆధ్వర్యంలో పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయి. ఇటీవల నియోజకవర్గంలోని చిన్నశంకరంపేట, నిజాంపేట, రామాయంపేట మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ను వీడుతున్న లీడర్లు, కార్యకర్తలు
మెదక్ నియోజకవర్గంలో రోజురోజుకూ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందన్న వాదనను విశ్లేషకులు వినిపిస్తున్నారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ట్లో చేరారు. దీంతో ఆయన అనుచరులు సైతం కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. నియోజకవర్గంలోని నిజాంపేట, రామాయంపేట మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, చిన్నశంకరంపేట మండలంలోని ఆయా గ్రామాలకు చెం దిన వారు బీఆర్ఎస్లో చేరుతున్నారు. మొత్తంగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జోష్లో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నేత లు తలలు పట్టుకుంటున్నారు. మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పడేం డ్లలో నియోజకవర్గంలో ఓ స్పష్టమైన మార్పు తీసుకొచ్చారని, బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుండగా, కాంగ్రెస్ పార్టీ క్రమంగా పడిపోతోందన్న వాదన బలంగా వినిపిస్తున్నది.
మెదక్లో రహస్య రాజకీయం
బీఆర్ఎస్ నుంచి పద్మాదేవేందర్రెడ్డికి సీఎం కేసీఆర్ మెదక్ టికెట్ను ఖరారు చేయడంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులు రహస్యంగా పావులు కదుపుతున్నారు. ఎకడా పేరు బయటకు పొకకుండా బీఆర్ఎస్లో చేరేందుకు సానుకూలంగా ఉన్నట్లుగా సంకేతాలు పంపుతున్నారు. పేరు బయటకు వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురొవాల్సి వస్తుందనే భయాలే రహస్య భేటీలకు కారణంగా తెలుస్తోంది. ప్రజా సమస్యలను ఎమ్మెల్యే పరిష్కరించడంతో సఫలీకృతం కావడంతో బీఆర్ఎస్కే మద్దతిస్తున్నారు.