మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 23: జిల్లా కేంద్రంలో ఎంఎల్ఎస్ పాయింట్లో చోటు చేసుకున్న గోనె సంచుల కుంభకోణంలో అధికారులు నిజాలు తేల్చి ఎవరి ప్రమేయం ఉన్నా వదలొద్దని, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావును ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి ఆదేశించారు. మెదక్ జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం శనివారం కలెక్టరేట్లో జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్సీలు శేరి సుభాశ్రెడ్డి, యాదవరెడ్డితోపాటు అదనపు కలెక్టర్ రమేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సుభాశ్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గోనె సంచుల కుంభకోణం, పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టిందని పత్రికల్లో వచ్చిన కథనాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావు, డీఎంవో హరికృష్ణను ప్రశ్నించారు. సుమారు రూ.7 కోట్ల విలువ చేసే బియ్యం, గోనె సంచులు పక్కదారి పట్టాయని వారు సభా ముఖంగా తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతుందని, మూడేండ్లుగా ఇలా జరుగుతున్నట్లు తెలుస్తుందని, ఇక్కడ విధులు నిర్వహించిన అధికారులపై విచారణ చేపటాల్టని పౌరసరఫరాల కమిషనర్కు నివేదికలు పంపించినట్లు తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, మొత్తాన్ని రికవరీ చేయాలని అధికారులకు ఎమ్మెల్సీ సూచించారు. విద్యుత్ సమస్యలపై జడ్పీటీసీలు కృష్ణారెడ్డి, బాబ్యానాయక్, కొల్చారం, టేక్మాల్, నార్సింగి ఎంపీపీలు ట్రాన్స్కో ఎస్ఈ జానకీరామ్ దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్సీ సుభాశ్రెడ్డి జోక్యం చేసుకొని సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈకి సూచించారు.
‘మనఊరు-మనబడి’ కార్యక్రమం ద్వారా పాఠశాల్లో చేపట్టిన పనులకు బిల్లులు త్వరగా చెల్లించాలని పాపన్నపేట ఎంపీపీ చందనాప్రశాంత్రెడ్డి డీఈవో దృష్టికి తీసుకువచ్చారు. మల్లంపేట పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ఇక్కడి వారిని డిప్యూటేషన్పై పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిజాంపేటలోని హైస్కూల్కు నిధులు మంజురైన అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని తొందరగా పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ విజయ్కుమార్ డీఈవోను రాధాకిషన్ను డిమాండ్ చేశారు.
పాత పద్ధతి ద్వారానే రైతుబంధు పథకం అమలు చేయాలని మెదక్ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత పద్ధతి ద్వారానే రైతుబంధు పథకం అమలు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయధికారి గోవింద్ తెలిపారు. కేజ్వీల్ ట్రాక్టర్లు రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా రవాణాధికారులను ఎమ్మెల్సీ సుభాశ్రెడ్డి ఆదేశించారు. జిల్లాలో వివిధ నిధుల ద్వారా జరుగుతున్న పనుల పురోగతి వివరాల నివేదికలు ప్రజాప్రతినిధులు అందజేయాలని ఆయా శాఖల ఎస్ఈలకు ఎమ్మెల్సీ సూచించారు. సబ్సిడీ డబ్బులు చెల్లించిన గొర్రెల పంపిణీ చేపట్టాలని వెటర్నరీ అధికారులకు ఎమ్మెల్సీ సూచించారు.
కేసీఆర్ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి కేటాయించిన నిధులతో చేపట్టిన పనులు జరిగేలా ప్రతిపాదించిన తీర్మానాన్ని జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి ప్రవేశ పెట్టారు. దీనిని వెల్దుర్తి జడ్పీటీసీ రమేశ్గౌడ్ బలపర్చగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. నిజాంపేట జడ్పీటీసీ సభ్యుడు విజయ్కుమార్ మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్లో కలపాలని తీర్మానం ప్రవేశపెట్టగా, రేగోడ్ జడ్పీటీసీ యాదగిరి బలపర్చగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని, వికలాంగులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని, ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించేలా ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సమావేశంలో జడ్పీ సీఈవో శైలేశ్ వెంకట్, ఆయా శాఖాల జిల్లా అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.