సిద్దిపేట, జూన్ 15 : అమర్నాథ్లో సిద్దిపేట లంగరు ఏర్పాటు చేసి, మంచుకొండల్లో అన్నదానం చేయడం ఒక గొప్ప పుణ్యకార్యం అని, అమర్నాథ్ సేవా సమితి చేస్తున్న ఈ మంచి పని ఎందరికో ఆదర్శం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట శరభేశ్వర దేవాలయం వద్ద అమర్నాథ్ యాత్రకు వెళ్లే సరుకుల వాహనాన్ని సోమవారం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో కలిసి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సిద్దిపేట అంటే ఎకడికి వెళ్లినా ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. తిరుపతి, శ్రీశైలం, కేదార్నాథ్, అమర్నాథ్లో సిద్దిపేట వాసులు అన్నదానం చేయడం గొప్ప విషయం అన్నారు.
తెలుగువారికి అన్నం, మామిడికాయ తొకు అంటే ప్రత్యేక అభిమానం అని అన్నారు. దక్షిణ భారత్లో అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. 15ఏండ్లుగా ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టం అభినందనీయం అని, అందరి సహకారంతో సరుకులతో లారీని అమర్నాథ్కు పంపుతున్నామని తెలిపారు. సిద్దిపేట ఆధ్యాత్మిక, ధార్మిక సేవకు మారుపేరని, అందులో వైశ్యులు ముందు ఉంటారని హరీశ్రావు అన్నారు.

ఆధ్యాత్మికతో మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. మీరు చేస్తున్నది పుణ్యం కార్యం అని అన్నారు. ఈనెల 19న ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సిద్దిపేటలో గో సంరక్షణ యజ్ఞం తలపెట్టారని.. గో సంరక్షణపై వారి ప్రవచనాలు సిద్దిపేట వైశ్య కన్వెన్షన్ హాల్లో జరుగుతాయని హరీశ్రావు చెప్పారు. ఇలాంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు.
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మనసు కొండల్లో సిద్దిపేట సేవాగుణం జెండా ఎగుర వేస్తున్నారని, మనిషి బండరాయిలా ఉండొద్దని, అందరికీ అన్నం కావాలనే సందేశాన్ని ఇస్తున్నదని, ఆ సందేశాన్ని అమర్నాథ్ సేవా సమితి అందుకున్నదని, ఆకలి తీర్చే అన్నదాన సేవా సమితి ..ఆపద తీర్చే హరీశ్రావు ఉన్నారని అన్నారు. నిత్యం ప్రజల వెన్నంటే ఉండే హరీశ్రావు.. సిద్దిపేట ప్రజలను విడిచి ఉండలేరన్నారు. అమర్నాథ్ సేవా సమితి ఇంకా విస్తరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, సుడా మాజీ చైర్మన్ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్రెడ్డి, అమర్నాథ్ అన్నదాన సేవా సమతి అధ్యక్షుడు నందిని శ్రీనివాస్, నవీన్, గంప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.