మెదక్, అక్టోబర్ 25 : ఎఫ్సీఐ వచ్చే యాసంగి సీజన్లో వడ్లు ముడి బియ్యం, ఉప్పుడు బియ్యం(పారా బాయిల్డ్) బియ్యం కొనుగోలు చేయలేనని ఖరాఖండిగా చెప్పింది. ఈ నేపథ్యంలో వచ్చే యాసంగి సీజన్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు అయినా వేరుశనగ, మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుడుగు, నువ్వులు, ఆవాలు, కుసుమలు వంటి పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ సోమవారం ఒక ప్రకటనలో రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఈ వర్షాకాలం సీజన్లో పండించిన వరి పంటను కొనుగోలు చేయడానికి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారని ఆయన తెలిపారు. కాగా వచ్చే యాసంగిలో మాత్రం వరి కొనుగోలు అవకాశం లేనందున రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని అన్నారు.
మరిన్ని వివరాలకు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని వారి సలహాలు, సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలన్నారు. అదే విధంగా 27, 28, 29 తేదీల్లో రైతు వేదికలలో నిర్వహించే సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ రైతులకు సూచించారు.