Cattle | న్యాల్కల్, జూలై 23: మానవ మనుగడకు ప్రకృతి సంపదతో పాటు పశుసంపద కూడా చాలా ముఖ్యం. ప్రత్యక్షంగా, పరోక్షంగా మానవ సమాజానికి పశుసంపద ఎన్నో విధాలుగా మేలు చేస్తున్నది. కాలానికి అనుగుణంగా ఆరోగ్యంపై మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో పశువులకు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వానకాలంలో పశువుల వ్యాధుల బారిన పడకుండా పోషకులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. తొలిదశలో పశువులకు వచ్చిన రోగాలను గుర్తిస్తే కొంత వరకు నష్ట నివారణ చర్యలు తీసుకోవచ్చని పశువైద్య నిపుణులు, అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత వానకాలంలో రైతులు, యాజమానులు తమ పశువులకు సోకే వ్యాధుల బారి నుంచి కాపాడుకునే జాగ్రత్తలు.
వానకాలంలో పశువులు, జీవాలపై రైతులు, యాజమానులు అప్రమత్తంగా ఉండాలి. వానకాలంలో కురిసే వర్షాలతో నీటి పరిసరాలు, వాతావరణం కలుషితమవుతాయి. ముఖ్యంగా పశువులు, జీవాలకు మేయడానికి మేత, తాగడానికి శుభ్రమైన నీరు లభించదు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతాయి. వాటికి రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడుతాయి. వ్యాధి సోకిన పశువులు, జీవాలు మందలో వెళ్లినప్పుడు ఇతర పశువులు, జీవాలకు వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. వ్యాధులు సోకిన పశువుల మలమూత్రాలు, నోరు, కళ్ల నుంచి వచ్చే ద్రవాల ద్వారా కూడా ఇతర పశువులు వ్యాధి బారిన పడుతాయి. సీజనల్ వ్యాధులపై పశువులు, జీవాలను ఎప్పటికప్పుడు కనిపెడుతుండాలి. వెంటనే సమీపంలో పశువైద్య కేంద్రాలకు వాటిని తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలి.
– అంజిక్యా, మండల పశువైద్యాధికారి, న్యాల్కల్