గజ్వేల్, మే 29 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్పై బురదజల్లేందుకే ఫోన్ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చాయని, ఫోన్ట్యాపింగ్తో కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ఫోన్ట్యాపింగ్ను ముందుకు తీసుకొచ్చారని, ఫోన్ట్యాపింగ్ అనేది కేంద్ర ప్రభుత్వంలోని హోంశాఖ అత్యవసర పరిస్థితిలో చేపడుతుందన్నారు. మొన్నటిదాక అసలు కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయడం కుదరదన్న ప్రభుత్వం ఇప్పుడు పనులు చేపడుతున్నదన్నారు. ప్రజలకు మెరుగైన పాలనను అందించి వారి సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ధ చూపించని ప్రభుత్వం అప్పుడు ప్రజలను దారి మళ్లించేందుకు కాళేశ్వరాన్ని ముందుకుతెచ్చి, ఇప్పుడు ఫోన్ట్యాపింగ్తో కాలం గడుపుతున్నారన్నారు. ఇదంతా చోటాభాయ్… బడేభాయ్ అడుతున్న నాటకమన్నారు. ట్యాపింగ్తో కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో విత్తనాలు దొరక్క రైతులు రోడ్లపైకి వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఐదు నెలల్లోనే రాష్ట్రంలో లిక్కర్పై రూ.5వేల కోట్లు, బియ్యంపై వేయి కోట్లు, హైదరాబాద్లో భవనాలు నిర్మించుకుంటే ఆర్ఆర్ఆర్ టాక్స్ను వసూళ్లు చేస్తున్నరని వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు.
ఐదునెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, కాంగ్రెస్ అంటేనే స్కామ్లన్నారు. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల వారికి న్యాయం చేసే సంక్షేమ పథకాలను అమలుచేశారన్నారు. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని పదేండ్లలో చూపించిన ఘనత కేసీఆర్కే దక్కుతున్నదన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి అద్భుతంగా కొత్తగా కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలను నిర్మించుకున్నామన్నారు. ప్రాజెక్టులను నిర్మించుకొని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించామన్నారు. హరితహారంలో భాగంగా 286 కోట్ల మొక్కలు నాటడంతోపాటు 34లక్షల ఎకరాల్లో అడవుల విస్తరణ చేపట్టామని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మూడు రోజులపాటు అద్భుతంగా నిర్వహిస్తామని అందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన 14ఏండ్ల పోరాటంతో పదేండ్లలో అన్ని వర్గాలకూ న్యాయం చేశామన్నారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, రాష్ట్ర ఎంపీటీసీ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీరవీందర్, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు జుబేర్ పాషా, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు, నాయకులు సత్యనారాయణ, యాదవరెడ్డి, బాల్రెడ్డి, కుమార్, శ్రీనివాస్ గౌడ్, కవిత, గణేష్గుప్తా, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.