సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 23: జిల్లాలో ఓటరు నమోదు, మార్పుల చేర్పులకు నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మరీ రివిజన్ మరింత వేగవంతంగా చేపట్టాలని స్వీప్ కన్సల్టెంట్ భవానీ శంకర్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లాను సందర్శించిన ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయ స్వీప్ కన్సల్టెంట్ భవానీ శంకర్ కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు, బూత్ స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. స్పెషల్ సమ్మరీ రివిజన్-2022 స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, స్పెషల్ క్యాంపేయిన్ తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భవానీ శంకర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ప్రతి ఏడాది స్పెషల్ సమ్మరీ రివిజన్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఓటరు జాబితాను సవరణ చేస్తుందన్నారు.
బీఎల్వోలు, ఆయా అధికారులు సమన్వయంతో పని చేసి తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలన్నారు. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్ ఓటరు జాబితాలో నమోదయ్యేలా చొరవ చూపాలన్నారు. మున్సిపాలిటీల్లో ప్రత్యేక శ్రద్ధవహించాలని, ఓటరు నమోదు, స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పనిని పర్యవేక్షించాలని సూచించారు. 18 ఏండ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకు కళాశాలలో స్పెషల్ క్యాంపేయిన్ చేపట్టాలన్నారు. ఓటరు నమోదు, జాబితా సరి చూసుకునేందుకు ఈనెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్టు వివరించారు.
ఆయా రోజుల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో బీఎల్వోలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. బూత్స్థాయి అధికారి అందించే సేవలకు సంబంధించిన పోస్టర్లను ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రదర్శించాలని సూచించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇతర ప్రచార మాధ్యమాలతో ఓటు హక్కు నమోదుపై విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్ట చేశారు. జిల్లాలో విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో గల అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు క్లెయిమ్స్కు సంబంధించి దరఖాస్తులను డిసెంబర్ 8 వరకు స్వీకరించాలన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి జిల్లాలోని ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, నూతన ఓటరు నమోదు వివరాలు, ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం పురోగతి తదితర అంశాలను స్వీప్ కన్సల్టెంట్కు వివరించారు. జిల్లాలో స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా అన్ని కళాశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించి వారిచే ఓటరు హెల్ప్లైన్ యాప్ ద్వారా నమోదు చేయిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు యువతను భాగస్వాములను చేసి 100 శాతం ఓటరు నమోదుతో పాటు తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శరత్ను స్వీప్ కన్సల్టెంట్ భవానీ శంకర్ కలిశారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు ఇతర అధికారులతో జిల్లాలో ఓటరు జాబితా తదితర అంశాలపై మాట్లాడారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో డీపీవో సురేశ్ మోహన్, డీపీఆర్వో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు, బూత్స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
100 శాతం పారదర్శకమైన, తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించడమే ఎన్నికల కమిషన్ లక్ష్యమని స్వీప్ కన్సల్టెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భవానీ శంకర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో స్వీప్, కళాశాల ఎన్ఎస్ఎస్ 1, 2, 3, 4 విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఓటరు నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భవానీ శంకర్ ఓటరు నమోదుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ నెల 9న ప్రారంభమైన సమ్మరీ రివిజన్ డిసెంబర్ 8వరకు కొనసాగుతుందని, ఈ లోగా ప్రతి ఒక్కరూ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జనవరి 5న ఓటరు జాబితా ప్రచురితమవుతుందని, ఆ సమయానికి అర్హులందరికీ ఓటుహక్కు కల్పించబడుతుందన్నారు. దేశంలో యువతకు కొదువలేదని సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి స్పష్టం చేశారు. ఇకనుంచి ప్రతి జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించనున్నట్టు వెల్లడించారు.
అనంతరం డిగ్రీ విద్యార్థులకు ఫారం-6ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో నగేశ్, తహసీల్దార్ విజయ్కుమార్, కలెక్టరేట్ ఏవో మహిపాల్రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకటేశం, డాక్టర్ జగదీశ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.