మెదక్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఆకుపచ్చ తెలంగాణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడు విడతల్లో నిర్వహించిన హరితహారంతో పచ్చదనం పెరిగింది. అటవీ ప్రాంతంలో లక్షలాదిగా మొక్కలు నాటడంతో పాటు సామాజిక అడవుల పెంపకంపై యంత్రాంగం దృష్టి సారించింది. ఈసారి మెదక్ జిల్లాలో 34.42 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే మెదక్ కలెక్టర్ హరీశ్ సమీక్ష నిర్వహించి దిశానిర్ధేశం చేయగా, అధికార యంత్రాంగం హరితహారానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి పంచాయతీలోని నర్సరీలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి.
నాలుగు మున్సిపాలిటీలు.. 21 మండలాలు
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 21 మండలాల్లో హరితహారం నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యాలు నిర్ధేశించారు. వర్షాలు కురుస్తుండడంతో మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. కొన్ని మండలాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు కూడా తవ్వించారు. కొన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అనధికారికంగా మొక్కలు నాటుతున్నారు. ఇటీవల చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా కొన్ని మొక్కలు నాటారు.
డీఆర్డీఏ ఆధ్వర్యంలో 23 లక్షల టార్గెట్..
హరితహారంలో డీఆర్డీవో (జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ) కీలకంగా పనిచేస్తున్నది. ఈసారి గ్రామాల్లో 23 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. ప్రధానంగా ఎవెన్యూ ప్లాంటేషన్పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా రోడ్లకు ఇరువైపులా, గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. మొక్కలు నాటేందుకు గుంతలను ఉపాధి కూలీలతో తీయిస్తున్నారు. డీఆర్డీవో ఆధ్వర్యంలో 10 లక్షల గుంతలు తవ్వించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో 50 శాతం మేర గుంతల తవ్వకం పూర్తయ్యింది.
ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు..
హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మండలాల్లోని నర్సరీల్లో పండ్లు, నీడనిచ్చే మొక్కలు పెంచుతున్నారు. బాదం, వేప, కానుగు, చింత, మామిడి, జామ, ఉసిరి, నిమ్మ, దానిమ్మ, గులాబీ, మందార, మల్లె తదితర మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు నర్సరీల్లో మొక్కలను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, పర్యవేక్షణ చేస్తున్నారు.
మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాం..
జిల్లాలో ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈసారి డీఆర్డీవో ఆధ్వర్యంలో 23 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఇప్పటికే 10 లక్షల గుంతలు తవ్వించాం. ప్రతి పంచాయతీలోని నర్సరీలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి.
– శ్రీనివాస్, డీఆర్డీవో, మెదక్
అన్ని ఏర్పాట్లు చేశాం..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన హరితహారం కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లోని రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేపడుతున్నాం. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు నాటాలని సూచి స్తున్నాం. హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యువకులు భాగస్వామ్యం కావాలి.
– రవిప్రసాద్, డీఎఫ్వో, మెదక్