జహీరాబాద్, జూలై 13: హైకోర్టు తుది తీర్పువచ్చే వరకు నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల జోలికి సంబంధిత శాఖ అధికారులు రావద్దని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, నిమ్జ్ భూ బాధితులు స్పష్టం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు బి.రామచందర్ ఆధ్వర్యంలో నిమ్జ్ భూ బాధిత రైతులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని తహసీల్ కార్యాలయం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రైతులు తమ భూముల్లో సాగు చేసిన పంటలు కోయటానికి పూర్తి అవకాశం కల్పించాలని, పంట కోత పనులు పూర్తయ్యేవరకు ఎలాంటి ఆటంకం కల్పించవద్దని స్పష్టంగా ఆదేశించిందన్నారు. హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి పనులు, రైతుల భూముల్లోకి వెళ్లరాదని ఆదేశించినప్పటికీ నిమ్జ్ అధికారులు రైతుల భూముల్లో కొలతలు, సర్వేలు, ఫెన్సింగ్ పనులు చేపడుతూ భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిమ్జ్ బాధిత రైతుల భూముల జోలికి రావద్దని, ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతుల భూముల్లోకి వెళ్తే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ విశాలక్షి, ఆర్డీవో దేవుజాలకు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, నిమ్జ్ బాధిత రైతులు శంకర్, సుకుమార్, తుల్జారామ్, అంజన్న, గోపాల్, నారాయణ, కిష్టన్న, యూసుఫ్, సంగన్న, నర్సమ్మ, మానేన్న పాల్గొన్నారు.