మెదక్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో అత్యాధునిక పరికరాలతో రేడియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు డీఎంహెచ్వో డాక్టర్ చందూనాయక్, జిల్లా జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ పి.చంద్రశేఖర్ తెలిపారు. ఈ రేడియాలజీ హబ్ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు బుధవారం ప్రారంభిస్తారని వారు చెప్పారు. ఈ విషయమై వారు మంగళవారం జిల్లాకేంద్ర దవాఖానలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మెరుగైన పరీక్షల కోసం రేడియాలజీ హబ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.95 లక్షల 60 వేల మంజూరు చేసిందన్నారు. జిల్లాకేంద్ర దవాఖాన భవనంలోనే ఈ రేడియాలజీ హబ్ కొనసాగుతుందని చెప్పారు. ఈ హబ్లో ఐదు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. 2డీ-ఎకో, అల్ట్రాసౌండ్, ఈసీజీ, మమోగ్రామ్, ఎక్స్-రే పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రభుత్వ దవాఖానలు సరికొత్తగా మారాయని, స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా వసతులు కల్పిస్తుందని తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడం, నాణ్యమైన మందులు అందిస్తుండడంతోనే ప్రజాదరణ పెరుగుతుందని చెప్పారు.