ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు దరఖాస్తుల వెల్లువ
ఆరో తరగతిలో 160 సీట్ల కోసం 400కు పైగా దరఖాస్తులు
అడ్మిషన్ కోసం తల్లిదండ్రుల క్యూ..
7వ, 8వ, 9వ, 10వ తరగతుల్లో అడ్మిషన్లు ఫుల్
‘అడ్మిషన్లు ఫుల్’ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులు
పాఠశాలలోని అన్ని తరగతుల్లో ఉన్నది మొత్తం 1195 సీట్లు
ఉత్తమ బోధనకు కేరాఫ్ ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల
‘ప్లీజ్.. మీ స్కూల్లో మాకు ఒక్క అడ్మిషన్ ఇవ్వండి’.. అని కార్పొరేట్ స్కూళ్లలో వినబడే మాట ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో వినిపిస్తోంది.. అదెక్కడో కాదు.. మన సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్లో.. ఇది కేవలం ఈ యేడాదే కాదు.. ఏడేండ్ల నుంచి ఇదే జరుగుతున్నది. ‘అడ్మిషన్లు ఫుల్’ అనే బోర్డు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఆ పాఠశాల విద్యలో.. విజ్ఞానంలో.. పోటీతత్వంలో.. కార్పొరేట్కు దీటుగా దూసుకెళ్తుండడంతో ఈ దృశ్యం ఏటా కనిపిస్తోంది. ఆ పాఠశాలలో కేవలం ఆరో తరగతిలో 160 సీట్లు ఖాళీ ఉండగా, సోమవారం 400కు పైగా దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సిద్దిపేట అర్బన్, జూన్ 20 : ‘మాకు ఒక్క సీటు ఇప్పించండి సారూ’.. అంటూ వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిరోజూ ఆ పాఠశాలకు క్యూ కడుతున్నారు. ఉన్నవి 160 సీట్లు మాత్రమే. కానీ, వందల మంది పేరెంట్స్ క్యూ. ఇలాంటి యేటా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే జరుగుతుంది. విద్యలో, విజ్ఞానంలో, పోటీతత్వంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా దూసుకెళ్తూ ‘అడ్మిషన్లు ఫుల్’ అని బోర్డు పెట్టే అరుదైన సన్నివేశం ఆ పాఠశాలలో కనబడుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులతో పాఠశాల ప్రాంగణం మూడు రోజులుగా కిక్కిరిసిపోతుంది. మంత్రి హరీశ్రావు కృషితో పాఠశాల సకల హంగులతో, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దబడి పలు పాఠశాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. అలాంటి ప్రభుత్వ పాఠశాల సిద్దిపేట పట్టణంలో ఉన్న ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల. ఈ పాఠశాలలో అడ్మిషన్ దొరకాలంటే ప్రజాప్రతినిధులతో, పై అధికారులతో రికమెండ్ చేయాల్సిన పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు.
అడ్మిషన్లు ఫుల్..
ఆరేండ్ల క్రితం 300మంది విద్యార్థులున్న ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో క్రమక్రమంగా సీట్లు పెంచుతున్నా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2022-23 విద్యా సంవత్సరానికి 1195 విద్యార్థుల సామర్థ్యం ఉన్న ఆ పాఠశాలకు ఇప్పటికే అన్ని తరగతుల్లో సీట్లు నిండిపోయాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్న ఈ పాఠశాలలో ఆరు, ఏడు తరగతుల్లో నాలుగు సెక్షన్లు, ఎనిమిది, తొమ్మిది, పదో తరగతుల్లో ఐదు సెక్షన్ల చొప్పున తరగతులు బోధిస్తున్నారు. 1195 మంది విద్యార్థుల సామర్థ్యం గల ఈ పాఠశాలలో మొత్తం 23 సెక్షన్లుగా విభజించి తరగతులు బోధిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ సెక్షన్లు పెరుగుతున్నాయి. ఆరో తరగతిలో ప్రవేశాలకు 160 సీట్లు ఉండగా, 400కు పైగా దరఖాస్తులు సోమవారం ఒక్కరోజే వచ్చాయంటే, ఈ పాఠశాలలో సీటుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 7వ, 8వ, 9వ, 10వ తరగతుల్లో అడ్మిషన్లు నిండిపోగా, ఆరో తరగతిలో దరఖాస్తుల కోసం రోజూ వందల మంది తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకునేందుకు క్యూ కడుతున్నారు.
సకల సౌకర్యాల పాఠశాల..
మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు అన్ని రకాల సదుపాయాలను సమకూర్చారు. పాఠశాల హెచ్ఎం రామస్వామి, ఉపాధ్యాయ బృందం సమష్టి కృషి, విద్యార్థుల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి హరీశ్రావు పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. పాఠశాల భవనాన్ని పునరుద్ధరించడంతో పాటు నాట్కో సంస్థ సహకారంతో ఆరు అదనపు తరగతి గదులు నిర్మించారు. అంతే కాకుండా పాఠశాలలో డిజిటల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్ కోసం భవనం, గూగుల్ ఫ్యూచర్ క్లాస్ సదుపాయం, సోలార్ పవర్ యూనిట్, మోడల్ వంటశాల, వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. పాఠశాలలోని ప్రతి తరగతి సీసీ కెమెరాలకు అనుసంధానం చేసి ఉంది. ఈ పాఠశాలలో ప్రతి రికార్డు ఆన్లైన్లోనే నిక్షిప్తం చేసి ఉంచుతారు.
అవార్డులకు నెలవు ..
జాతీయ స్థాయిలో యేటా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో జరిగే సెమినార్లకు ఈ పాఠశాలకు ఆహ్వానం వస్తుంది. 2017 నుంచి జాతీయ స్థాయిలో విద్యారంగంపై జరిగిన సెమినార్లలో హెచ్ఎం రామస్వామి పాల్గొని, పాఠశాల అభివృద్ధి, ఇన్నోవేటివ్, లీడర్షిప్ తదితర అంశాలపై వివరిస్తారు. రామస్వామికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. ఇంకా రాష్ట్రస్థాయిలో ఇందిరానగర్ పాఠశాలకు 5 అవార్డులు వరించాయి. ఇవే కాకుండా జిల్లా స్థాయిలో చాలా అవార్డులు వచ్చాయి.
నా కొడుకుకు సీటు కోసం తిరుగుతున్న..
మా బాబును 6వ తరగతిలో చేర్పిద్దామని వచ్చా. అడ్మిషన్లు ఫుల్ అయినయి అని చెబుతున్నరు. ఈ స్కూల్లో మంచిగా చెబుతురని ఇక్కడి వచ్చిన. కానీ, ఇక్కడికి వచ్చి చూస్తే చాలా మంది సీటు కోసం వచ్చారు. ఇంత మంచిగ సదువు చెప్పే ఇలాంటి పాఠశాలలో చేర్పిస్తే మా బాబు బాగా చదువుకుంటడని ఇక్కడికి వచ్చా.
– కొండ్ర కవిత, ఇర్కోడు, సిద్దిపేట రూరల్ మండలం
ఇప్పటికే అడ్మిషన్లు ఫుల్ అయ్యాయి..
ఆరో తరగతికి మాత్రమే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కేవలం 160 సీట్లు మాత్రమే ఉన్నాయి. మొదటగా ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మాత్రమే సీటు కేటాయిస్తాం. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తాం. సీట్లు మిగిలితే ప్రత్యేక పరిస్థితులు ఉన్నవారికి ఇచ్చి, తర్వాత ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఇస్తాం. ఇప్పటికే 7వ, 8వ, 9వ, 10వ తరగతుల్లో ఖాళీలు లేవు. ఖాళీలు ఏర్పడితేనే సీట్లు ఇస్తాం. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని మనవి. – పయ్యావుల రామస్వామి, హెచ్ఎం, ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల