సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 26: సంగారెడ్డి జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.7,800 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక ఆమోదించినట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో డీసీసీ, డీఎల్ఆర్సీ సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వార్షిక రుణ ప్రణాళికను వీరారెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం, వాణిజ్యం, విద్య, గృహ రుణాలు, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక రంగాలకు రూ.6,565 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,235 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పంట ఉత్పత్తి, నిర్వహణ మార్కెటింగ్ కోసం రైతులకు పంట రుణాలు అందించనున్నట్లు వివరించారు.
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలు, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయ టర్మ్ రుణాల కోసం రూ.4,147 కోట్లు, సూక్ష్మ సంస్థలకు రూ.516.60 కోట్లు, చిన్న సంస్థలకు రూ.167.40 కోట్లు, మధ్య తరహా సంస్థలకు రూ.326 కోట్ల రుణాలు ఇవ్వడం లక్ష్యంగా ఉన్నదని స్పష్టం చేశారు. విద్యా రుణాల కింద రూ.85 కోట్లు, గృహ రుణాలు రూ.1,270 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు రూ.46 కోట్లు, పునరుత్పాదక శక్తి కింద రూ.7 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,235 కోట్ల రుణాలు ఇవ్వడం లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ఆయా రంగాలకు కేటాయించిన రుణాలు అందించడంలో బ్యాంకర్లు సహకరించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకర్లు, జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ గోపాల్రెడ్డి, నాబార్డ్ ఏజీఎం కృష్ణతేజ, ఆర్బీఐ ఏజీఏం అలీబాబా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల మేనేజర్, ఆయా శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.