హుస్నాబాద్, డిసెంబర్ 16 : హుస్నాబాద్ పట్టణంలో ఇంకా అంసపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను సత్వరంగా పూర్తి చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ఆదేశించారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను ఆయన పర్యవేక్షించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్లలో సౌకర్యాలను పరిశీలించారు. ఇంకా పూర్తి కాబోయే ఇండ్ల పనుల వివరాలను కాంట్రాక్టరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 168 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 96ఇండ్ల పనులు తుదిదశలో ఉన్నందును వాటి పనులను సత్వరంగా పూర్తి చేయాలన్నారు. జనవరి 10వ తేదీలోపు మొత్తం 264 ఇండ్ల పనులు సంపూర్ణంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.
మున్సిపల్ అధికారులు డబుల్ బెడ్రూం ఇండ్ల ఆవరణలో విరివిగా మొక్కలు నాటించడంతో పాటు ఆవరణ మొత్తం పరిశుభ్రంగా ఉంచడం, శానిటేషన్ సక్రమంగా నిర్వహణ చేయడం చూసుకోవాలన్నారు. స్థానిక తహసీల్దార్ డబుల్ బెడ్రూం ఇండ్ల సౌకర్యాల చెక్లిస్టును తీసుకొని, దాని ప్రకా రం ఇండ్లలో సౌకర్యాలు కల్పించారా? లేదా? అని చూడాలని ఆదేశించారు. ఒక టీంను ఏర్పాటు చేసి సౌకర్యాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. చెక్లిస్టు ప్రకారం సౌకర్యాలు లేకుంటే వెంటనే ఏజెన్సీ ద్వారా చేయించాలన్నారు. విద్యుత్శాఖ అధికారులు మీటర్ల బిగింపు ప్రక్రియను పూర్తిచేయాలని, మిషన్ భగీరథ అధికారులు నీటి సౌకర్యంపై దృష్టి సారించాలని సూచించారు. వచ్చే సంక్రాంతి లోపు డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభోత్సవానికి సిద్ధంగా చేయాలని ఏజెన్సీ ప్రతినిధులను ఆయన ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు సత్వరంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, కమిషనర్ రాజమల్లయ్య, వైస్ చైర్పర్సన్ అయిలేని అనితాశ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు కొంకటి నళినీదేవిరవి, బోజు రమారవీందర్, అయిలేని శంకర్రెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, ఆర్అండ్బీ ఏఈ సాజిత్ తదితరులు ఉన్నారు.