సంగారెడ్డి, డిసెంబరు 14: జిల్లాలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అధికారులను సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో దివ్యాంగుల క్రీడా పోటీల నిర్వహణకు అధికారులు పట్టణంలోని అంబేద్కర్ మైదానాన్ని సిద్ధం చేయాలన్నారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించాలన్నారు. జూనియర్ కేటగిరీలలో 10 నుంచి 16 సంవత్సరాల వయస్సు వారు, సీనియర్ విభాగంలో 17 నుంచి ఆపై వయస్కులు(బధిరులు, అంధులు, శారీరక, మానసిక వైకల్యంగల దివ్యాంగులు) పాల్గొనాలన్నారు.
క్రీడా పోటీల్లో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు, మండల సమాఖ్య, పట్టణ, మండల దివ్యాంగుల సమాఖ్య, జిల్లా సమాఖ్యల సహకారంతో ఆయా సంఘాల్లోని దివ్యాంగులు క్రీడా పోటీల్లో పాల్గొనేలా ప్రాత్సహించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ పీడీ శ్రీనివాస్రావు, మెప్మా పీడీ గీతలకు సూచించారు. క్రీడ పోటీలను విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో జిల్లా యువజన క్రీడల అధికారి రామ్చందర్రావు, డీడబ్ల్యూ సంధ్యరాణి, డీఆర్డీఓ శ్రీనివాస్రావు, డీఈఓ వెంకటేశ్వర్లు, యువజన క్రీడల అధికారి రామ్చందర్రావు, డీఎంహెచ్ఓ గాయత్రీదేవి, మెప్మా పీడీ గీత, మున్సిపల్ కమిషనర్ సుజాత, తదితరులు పాల్గొన్నారు.