మనోహరాబాద్: ఆడ పిల్లలను స్వేచ్ఛగా పెరగనిద్దామని, మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. శివ్వంపేట మండల చెండి ఫంక్షన్హాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఆడపిల్లల పరిరక్షణ, బాల్యవివాహాల నిర్మూలన, బాలల పరిరక్షణ కమిటీలపై ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మదన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బాల్యవివాహాల వల్ల వారి బంగారు భవిష్యత్ను చేతులారా నాశనం చేసిన వారమవుతామన్నారు. తల్లిదండ్రులు సైతం ఆడ పిల్లలను ఉన్నత విద్యలు చదివించాలని సూచించారు.
ఆడ పిల్లల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరువ చూపుతుందన్నారు. ఆడ పిల్లలు అన్ని రంగాల్లో రాణించే విధంగా సీఎం కేసీఆర్ ప్రొత్సాహం కల్పిస్తున్నారు. ఆడ పిల్ల పుడితే కేసీఆర్ కిట్తో రూ. 14 వేలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. అదే విధంగా వివాహానికి రూ.1,00116లను అందించి వారికి పెద్దన్నగా నిలిచారన్నారు. బాలలను బడి పంపాలే కాని పనికి కాదని సూచించారు. ఎవరైనా చదువుకునే పిల్లలను పనికి పంపితే చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సి వస్తుందన్నారు.
ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ భవనాలకు మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించా రు. అనంతరం చిన్నారులతో ఎమ్మెలేకు రాఖీ కట్టించారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, తహసీల్దార్ రవికుమార్, ఎంఈవో బుచ్యానాయక్, ఎంపీడీవో నవీన్కుమార్, సర్పంచ్ల ఫోరం మండల అధ్య క్షురాలు లావణ్య సీడీపీవో హేమభార్గవి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు స్వరూప, సరళకుమారి, జ్యోతి, శశికళ, కవిత, సర్పంచ్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.