మద్దూరు (ధూళిమిట్ట), జనవరి 18 : నేటి నుంచి దుబ్బతండా తనదేనని, గ్రామస్తులు పంచిన ఆత్మీయత మరువలేనిదని ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ అన్నారు. బుధవారం రాత్రి ధూళిమిట్ట మండలంలోని దుబ్బతండా పంచాయతీ పరిధిలోని చెలిమెతండాను ఆయన సందర్శించారు. చెలిమెతండాలో రెండేండ్ల క్రితం సోనూసూద్ ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి, ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహాన్ని చూసి ఆయన మురిసిపోయారు. అనంతరం సోనూసూద్ మాట్లాడుతూ రెండేండ్ల క్రితం గ్రామంలో ఆలయం నిర్మించినట్లు తెలిపారు. తండాను సందర్శిస్తానని అప్పుడే తండావాసులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆలయాన్ని నిర్మించిన తండావాసులకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. తండావాసులు పలికిన ఘన స్వాగతానికి తాను భావోద్వేగానికి గురైనట్లు తెలిపారు. త్వరలో గ్రామస్తులతో ప్రత్యేకంగా మాట్లాడి గ్రామంలోని సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానని చెప్పా రు. ఆలయాన్ని నిర్మించిన చెలిమెతండాకు రుణపడి ఉంటానన్నారు. గ్రామస్తులకు 24గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు. అంతకుముందు సోనూసూద్కు భూక్యా రాజేశ్ ఆధ్వర్యంలో యువకులు ప్రతిమను బహూకరించారు.
సోనూసూద్కు ఘన స్వాగతం
చెలిమెతండాను సందర్శించిన సోనూసూద్కు తండావాసులు ఘన స్వాగతం పలికారు. బంజారా మహిళలు సంప్రదాయ వస్ర్తాలు ధరించి మంగళహారతులతో పూలు చల్లుకుంటూ స్వాగతం పలికారు. యువకులు జై సోనూసూద్, జైజై సోనూసూద్ అంటూ కేరింతలు కొట్టారు. జడ్పీటీసీ గిరి కొండల్రెడ్డి, సర్పంచులు లకావత్ సుజాతాశ్రీనివాస్, జాటోత్ రేణుకాఖల్రాం, బండి శ్రీనివాస్, ఎంపీటీసీ ఇస్లావత్ నముక్ తదితర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సోనూసూద్కు స్వాగతం పలికారు. వల్లంపట్లలో సర్పంచ్ ఆలేటి రజితాయాదగిరి ఆధ్వర్యంలో సోనూసూద్కు గ్రామస్తులు స్వాగతం పలికారు.
చేర్యాలలో సందడి..
చేర్యాల, జనవరి 18 : చెలిమెతండాకు వెళ్లే క్రమంలో సోనూసూద్కు పట్టణంలో అభిమానులు దారిపొడవునా ఘనస్వాగతం పలికారు. సోనూసూద్తో ఫొటోలు దిగేందుకు యువకులు పోటీపడ్డారు. చేర్యాలలో ఓ బాలుడిని ముద్దాడుతూ సోనూసూద్ మురిసిపోయారు.