సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 10: జిల్లాలోని రసాయన పరిశ్రమల్లో కాలం చెల్లిన రియాక్టర్లను వెంటనే మార్చాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. రసాయనిక పరిశ్రమల్లో భద్రతపై బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత శాఖ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రసాయన పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు, పేలుళ్లను నివారించేందుకు ఆధునిక సాంకేతికను వినియోగించాలని సూచించారు. రియాక్టర్ల జీవిత కాలాన్ని ధ్రువీకరించే థర్డ్ పార్టీ తనిఖీ నివేదికలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల తనిఖీ నివేదికలను అందించాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు.
ఈనెల మూడో వారంలో నిపుణులతో పారిశ్రామిక భద్రత, స్టాండర్డ్ ఆపరేటీవ్ నోట్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ)పై జిల్లాలోని అన్ని రసాయనిక పరిశ్రమల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని పరిశ్రమల అధికారులను ఆదేశించారు. ప్రతి పరిశ్రమను జిల్లా పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. రియాక్టర్లు ఉన్న పరిశ్రమలు లాగ్బుక్ నిర్వహించాలన్నారు. ప్రతి కంపెనీలో సేఫ్టీ పరికరాలను వినియోగించాలని, పరిశ్రమల కార్మికులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. పరిశ్రమల్లో భద్రత నియమాలను పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ ప్రశాంత్ కుమార్, జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాస్, పీసీబీ అధికారి గీత, పటాన్చెరు పరిశ్రమల శాఖ అధికారి కుమార్ పాఠక్, ఫ్యాక్టరీల ప్రతినిధులు పాల్గొన్నారు.