మెదక్, జనవరి 23 : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మెదక్ జిల్లాలో జోరుగా సాగుతోంది. టీకాతోనే కరోనాకు అడ్డుకట్ట అని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ను ముమ్మరం చేసింది. ప్రజలు కూడా వ్యాక్సిన్ కోసం కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
మెదక్ జిల్లాలో ఏడు లక్షల మంది..
జిల్లాలో జనాభా 7,67,428 ఉండగా, 5,48,340 మందికి వ్యాక్సిన్ టార్గెట్ కాగా ఇప్పటి వరకు 11 లక్షల 1,738 మందికి టీకా వేశారు. అంటే 111.38 శాతం పూర్తి చేశారు. ఇందులో మొదటి డోసు 6,10,666 మంది తీసుకోగా, రెండో డోసు 4,91,072 మంది టీకా తీసుకున్నారు. అయితే 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల వారు మొదటి డోసు 2,54,273 మంది వేసుకోగా, రెండో డోసు 1,77,536 మంది తీసుకున్నారు. మొత్తంగా 4,31,809 మంది టీకా వేసుకున్నారు. 45 నుంచి 59 ఏండ్ల వారు మొదటి డోసు 2,06,759 మంది టీకా వేసుకోగా, రెండో డోసులో 1,97,465 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. మొత్తం 4,04,224 మంది టీకా తీసుకున్నారు. 60 ఏళ్ల వారు మొదటి డోసులో 1,13,411 మంది కాగా, రెండో డోసు 1, 11,591 మంది తీసుకున్నారు. 2,25,002 మంది తీసుకున్నారు.
గతేడాది జనవరి 16 నుంచి ప్రారంభం
గతేడాది జనవరి 16 నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఫిబ్రవరి ఒకటి వరకు కొనసాగింది. వైద్య శాఖ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, మున్సిపల్, పోలీసు, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు మొదటి టీకా తీసుకున్నారు. గత మార్చి ఒకటి నుంచి 45 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ చేపట్టారు. మార్చి 15 నుంచి రెండో దశ కరోనా ఉధృత పెరగడం ఒక్కో రోజు 200లకు పైగా కేసులు నమోదు కాగా, ప్రజలు టీకా కోసం పరుగులు తీశారు. ఏప్రిల్ మొదటి వారం వరకు సజావుగా టీకాల ప్రక్రియ సాగింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం 18 ఏండ్లు పైబడిన వారందరికీ టీకా ఉచితంగా ఇస్తామని ప్రకటించినప్పటి నుంచి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. ప్రతి రోజూ వెయ్యికి పైగా టీకాలు వేశారు.
ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. అప్రమత్తతే ముఖ్యమని, మాస్క్ ధరించాలని ముఖ్యంగా శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున జనం పాల్గొంటే కరోనాను ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తున్నారు.
అర్హులంతా టీకా వేసుకోవాలి..
జిల్లాలో ఇప్పటి వరకు 11 లక్షల 1,738 మందికి వ్యాక్సి న్ వేశాం. అంటే 111.38 శాతం పూర్తి చేశాం. ఇందులో మొదటి డోసు 6,10,666 మంది తీసుకోగా, రెండో డోసు 4,91,072 మంది టీకా వేయించుకున్నారు. స్పెషల్ వ్యాక్సినేషన్ కింద 8లక్షల 9వేల మందికి టీకా వేశాం.
-డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్వో మెదక్