టేక్మాల్, మార్చి 12: మండల పరిధిలోని ధనూర గ్రామానికి చెందిన ఒక విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ధనూర గ్రామానికి చెందిన బందరుగల్ల అనిత, కుమార్ల కుమారుడు మనోహర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. రెండు నెలల క్రితం మనోహర్ పాఠశాలలో అల్లరి చేస్తున్నాడని అదే పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు చంద్రప్రకాశ్ మనోహర్ని కర్రతో కొట్టగా అది కాలు నరానికి బలంగా తగిలింది. దీంతో మనోహర్ సరిగా నడవలేని స్థితిలో ఉండడంతో బాలుడి తల్లిదండ్రులు ఉపాధ్య్యాయుడిని నిలదీశారు.
బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం ఉపాధ్యాయుడు రూ.10 వేలు ఇచ్చాడు. బాలుడి గాయం తీవ్రం కావడంతో ప్రస్తుతం నడువలేని స్థితిలో ఉన్నాడు. మనోహర్కు రెండు నెలలుగా సుమారు రూ.8 లక్షల వరకు ఖర్చు అయ్యాయని, వైద్య ఖర్చులు చెల్లిస్తామని చెప్పిన ఉపాధ్యాయుడు ప్రస్తుతం ఎలాంటి వైద్య ఖర్చులు భరించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దయానంద్ తెలిపారు.