మెదక్, ఫిబ్రవరి13 (నమస్తే తెలంగాణ): ప్రజావాణి ఫిర్యాదుదారుల సమస్యలను సావధానంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన 67 అర్జీలను అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్తో కలిసి స్వీకరించారు. ధరణి, భూ సమస్యలు, పోడు భూములు, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు తదితర అంశాలకు సంబంధించి ఫిర్యాదులున్నాయి. భూ సమస్యలకు సంబంధి ధరణిలో ఉన్న మాడ్యూల్స్ ప్రకారం పరిష్కరించాలని, భూ వివాదాలకు సంబంధించి కోర్టును ఆశ్రయించాలని, డబుల్ బెడ్ ఇండ్ల ఫిర్యాదులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
అనంతరం ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలను సమీక్షిస్తూ దళిత బంధు కింద చేపట్టిన పౌల్ట్రీ, పాడి పరిశ్రమల యూనిట్లు సమర్థవంతంగా నిర్వహించేలా అందుకు అవసరమైన విద్యుతు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు లబ్ధిదారులు తమవంతు వాటా చెల్లించేలా అవగాహన కల్పించాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి, పశు సంవర్ధక శాఖాధికారులకు సూచించారు. ఇళ్ల పట్టాలు అందజేసిన 1234 లబ్ధిదారులకు సంబంధించి ఇంతవరకు 1127 వివరాలు ఆన్లైన్లో పొందుపరచగా మిగిలిన వివరాలను నేటితో పూర్తి చేయాల్సిందిగా డీఎస్వోకు సూచించారు.
పౌష్టికాహారాన్ని అందించాలి
గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, సరఫరా ఏజెన్సీలు పాలు, గుడ్లు సకాలంలో సరఫరా సరిగా జరిగేలా చూడాలని మహిళా, శిశు సంక్షేమాధికారి సూచించారు. 6వేల మెట్రిక్ టన్నుల యూరియా కోసం వ్యవసాయ శాఖ కమిషనర్కు ప్రతిపాదనలు పంపాల్సిందిగా సూచించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఒకటిన్నర మాసాలే ఉన్నందున వంద శాతం టర్మ్ లోన్లు మంజూరుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ నెల 15న సేవాలాల్ జయంతి సందర్భంగా మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాల్లో ర్యాలీలు, సభలు నిర్వహించాల్సిందిగా బీసీ అభివృద్ధి, జిల్లా యువజన క్రీడల అధికారికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు వెంకట శైలేశ్, జయరాజ్, శ్రీనివాస్, చందు నాయక్, జెంలా నాయక్, కేశూరం, విజయ శేఖర్ రెడ్డి, సాయిబాబా, ఆశాకుమారి, రమేశ్ కుమార్, విజయలక్ష్మి, కృష్ణమూర్తి, కరుణ, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
సమస్యలు త్వరగా పరిష్కరించాలి:మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ అర్బన్, ఫిబ్రవరి 13: అర్జీదారుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 13: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్కు వినతులు వెల్లువెత్తాయి. ఆయా సమస్యలకు సంబంధించి మొత్తం 36 అర్జీలు అందాయి. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి క్షేత్ర స్థాయి కృషి చేస్తే త్వరితగతిన పూర్తవుతాయన్నారు. సమస్య పరిష్కారం కానట్లయితే అందుకుగల కారణాలను వివరంగా అర్జీదారులకు తెలుపాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్, ఏవో పాల్గొన్నారు.