రామాయంపేట, అక్టోబర్ 20 : ప్రభుత్వం మత్స్యకారులకు చేపల పెంపకంతో ఉపాధి కల్పిస్తున్నదని ఫిషరీష్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రజిని అన్నారు. గురువారం రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో పెదరాయిని చెరువులో గురువారం 1.94,444 చేపపిల్లలను వదిలారు. అనంతరం ఆమె మాట్లాడారు. మత్స్యకారులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదన్నారు. జిల్లా వ్యాప్తంగా 1351 చెరువుల్లో 3.47కోట్ల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. మరో 200 చెరువులపై కేసులు ఉన్నాయని, అందుకే వాటిలో చేపపిల్లలను వదలలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా చెరువులు, కుంటలు జళకళతో ఉట్టి పడుతున్నాయన్నారు. నిండిన చెరువులు, కుంట ల్లో చేపపిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. చెరువుల్లో చేపపిల్లల వల్ల నిరుద్యోగ మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా ప్రభుత్వం మత్స్యకారులకు టీవీఎస్, వలలు, ఆటోలు తదితర వాహనాలు కూడా సబ్సీడీ ద్వారా అందజేస్తున్నదని తెలిపారు. ప్రమాదాలకు గురైన మత్స్యకారులకు ఎక్స్గ్రేషియా అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూమగారి నర్సాగౌడ్, ఎంపీటీసీ సార్గు భాగ్యమ్మ భిక్షపతి, మాజీ ఎంపీటీసీ సార్గు సత్యనారాయణ తదితరులు ఉన్నారు.