సిద్దిపేటరూరల్/మెదక్ అర్బన్/ అక్టోబర్ 21: ఉమ్మడి మెదక్ జిల్లాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించుకుని ముందుకుసాగాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి తెలంగాణ శాసన సభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లుపై వీడియో కాన్ఫరెన్స్లో ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘనులపై వచ్చే ఫిర్యాదులను త్వరతగతిన పరిష్కరించాలని సూచించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులకు తప్పనిసరిగా 24 గంటల వ్యవధిలో తీసుకున్న చర్యలపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల నుంచి సువిధా యాప్ ద్వారా లేదా ఆఫ్ లైన్లో వచ్చే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు సకాలంలో అనుమతి మంజూరు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికల ప్రచారంలో వినియోగించే ఆడియో, వీడియోలను పరిశీలించి ధ్రువీకరించాలన్నారు.
సువిధా యాప్, ఆఫ్లైన్ దరఖాస్తులపై ఎన్నికల అధికారి దృష్టి సారించాలన్నారు. ఎన్నికల సమయంలో నిర్వహించే తనిఖీల్లో నగదు, బంగారం సీజ్ చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. నగదు సీజ్ చేసే సమయంలో సంబంధిత వ్యక్తులకు సీజ్ చేస్తున్న నగదు, బంగారం వివరాలు, ఎక్కడ అప్పీల్ చేయాల్సి ఉంటుంది అనే అంశాలు తెలియజేసి, పట్టుకున్న వాటికి రసీదు ఇవ్వాలన్నారు. సీజ్ చేసిన బంగారం, నగదు రూ.10 లక్షల కంటే తక్కువైతే వెంటనే జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్సెల్కు, రూ.10 లక్షల కంటే ఎక్కువైతే ఐటీ అధికారులకు అప్పగించాలన్నారు. నగదుపై వచ్చే అప్పీళ్లను సంబంధిత గ్రీవెన్స్ సెల్ లేదా ఐటీ అధికారులు పరిశీలించి నిబంధనలు, ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఎన్నికల సమయంలో సీజ్ చేసే నగదు, బంగారం, మద్యం, విలువైన ఆభరణాల విషయాన్ని మీడియాకు సమాచారం అందించాలన్నారు.
అప్పీల్ అనంతరం విడుదల చేసే నగదు, బంగారం వివరాలు తెలుపాలన్నారు. జిల్లాల్లో ఓటరు స్లిప్పులు త్వరగా ముద్రించి, పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల నిర్వహణపై వస్తున్న వదంతులు, అపోహలను నివృత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ పోలింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలపై అధిక దృష్టి సారించి పోలింగ్ శాతం పెరిగేలా అవగాహన కల్పించాలన్నారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు రాష్ర్టానికి చేరుకున్న కేంద్ర బలగాలను ఉపయోగించుకోవాలన్నారు. ప్రజలకు ధైర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం నుంచి వచ్చిన బలగాలు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు విధులు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. సిద్దిపేట సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ శ్వేత, డీఆర్ఓ నాగరాజమ్మ, డీపీఆర్ఓ రవికుమార్, మెదక్ జిల్లాలో సమీక్షా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, సంబధిత అధికారులు పాల్గొన్నారు.