హుస్నాబాద్ టౌన్, మే 24: అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పర్యావరణానికి మేలు చేసేందుకు మానవ మల వ్యర్థాలతో ఎరువు తయారీ కేంద్రానికి కేసీఆర్ ప్రభుత్వం హుస్నాబాద్లో శ్రీకారం చుట్టింది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు అనారోగ్యాన్ని దరి చేరకుండా మానవ మలంతో ఎరువులు తయారీ చేసే ప్లాంట్ హుస్నాబాద్ మున్సిపాలిటికీ మంజూరు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మానవ మలాన్ని పడేటయంతో ఎదురవుతున్న సమస్యలను దూరం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పనులు ప్రారంభించింది. కానీ బిల్లులు అందక పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులో ఎఫ్ఎస్టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్)ను నిర్మించేందుకు టీయూఎఫ్ఐడీసీ కింద రూ.కోటిని బీఆర్ఎస్ ప్రభుత్వం మం జూరు చేసింది. ఇందులోభాగంగా స్థానిక ఎల్లమ్మచెరువు సమీపంలో ఎకరా స్థలంలో ప్లాం ట్ నిర్మాణం చేపట్టారు. ప్లాంట్లో ప్రహరీ, ఆపరేటర్ గది, శిక్షణ గది, అనరబిక్ స్టెబిలైజేషన్ రియాక్టర్, స్లడ్జ్ డ్రైయింగ్ బెడ్స్, బ్యాలెన్సింగ్ ట్యాంకు, అనరబిక్ బ్యాపిల్ రియాక్టర్తో పాటు పలు నిర్మాణ పనులు చేపట్టారు. పట్టణంలో రోజువారీగా సేకరించిన పదివేల లీటర్ల మానవ వ్యర్థాలను వివిధ పద్ధతుల్లో శుద్ధిచేసి ఎరువును వ్యవసాయానికి ఉపయోగించడంతోపాటు మొక్కల పెంపకానికి సైతం వినియోగించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
హుస్నాబాద్ పట్టణానికి మంజూరు చేసిన ఎఫ్ఎస్టీపీ పనులు కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. దాదాపు ఆరవై శాతం పనులు పూర్తిచేసి వదిలివేశారు. ఎఫ్ఎస్టీపీలో వేబ్రిడ్జితోపాటు మూడు మోటర్లు బిగించడంతో పాటు అంతర్గతంగా సీసీరోడ్డు సైతం నిర్మించాల్సి ఉంది. కానీ బిల్లులు రావడం లేదని నిర్వహణ సంస్థ పనులు చేపట్టడం లేదు. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్ల ఎఫ్ఎస్టీపీ పనులు పూర్తికాలేదని పలువురు విమర్శిస్తున్నారు.
మానవ వ్యర్థాలతో ఎరువులు తయారు చేసేందుకు చేపట్టిన పనులు నిలిచిపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులు ముందుకు సాగేందుకు సరిపడా నిధులు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందనే భావన వ్యక్తం అవుతున్నది. ఇప్పటికైనా బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపై దృష్టి సారించి పనులు పూర్తిచేసే విధంగా చొరవ చూపాలని హుస్నాబాద్ ప్రజలు కోరుతున్నారు.
హుస్నాబాద్లో ఎఫ్ఎస్టీపీ పనులను మాప్రియధర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించారు. ఎల్లమ్మ చెరువు సమీపంలో చేపట్టిన ఈ పనులు దాదాపు 60 శాతం పూర్తి చేశారు. చేసిన పనులకు బిల్లులు రావడం లేదని పనులు చేయడం లేదు. పనులు నిలిచిపోయిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లాం. కానీ వారెవరూ దానిని పట్టించుకోలేదు.