ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కెథడ్రాల్ చర్చిలో క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం తెల్లవారుజామున శిలువ ఊరేగింపుతో వేడుకలు ప్రారంభమయ్యాయి. లోక రక్షకా.. ఏసుప్రభువా కాపాడు అంటూ భక్తులు ప్రార్థించారు. మొదటి ఆరాధనకు మెదక్ డయాసిస్ అధ్యక్ష మండల బిషప్ రెవరెండ్ పద్మారావు హాజరై భక్తులనుద్దేశించి వాఖ్యోపదేశం వినిపించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి సీఎస్ఐ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. 2024 సంవత్సరాంతం వరకు శతాబ్ది వేడుకలు నిర్వహించనున్నట్లు బిషప్ తెలిపారు. ఏసు చూపిన బాటలో అందరూ నడుచుకోవాలని ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలపై ఏసు ప్రభువు దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆకాంక్షించారు. క్రిస్మస్ను పురస్కరించుకొని భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సీఎస్ఐ కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు. చర్చి ప్రధాన ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లతో పోలీసులు తనిఖీ చేశారు. డీఎస్పీ ఫణీంద్ర ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మెదక్ చర్చి వద్ద మంగళ, బుధవారం జాతర సాగనున్నది. జాతరను పురస్కరించుకొని పలురకాల దుకాణాలు వెలిశాయి.
మెదక్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా నిర్వహించే క్రిస్మస్ను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చిలను ప్రత్యేకంగా అలంకరించారు. సోమవారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు. నార్సింగి మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన ఇండిపెండింట్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొని, క్రిస్మస్ కేక్ను కట్ చేసి మిఠాయిలు పంచారు. ప్రపంచంలో అతి పెద్ద పండుగ క్రిస్మస్ అని అన్నారు. నర్సాపూర్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పాల్గొని కేక్ కట్చేసి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు బోధనలు మానవాళికి ఎంతో ఆదర్శప్రాయమని ఆమె కొనియాడారు. వివిధ చర్చిల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.