జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) వద్ద ఉన్న ట్రైండెంట్ చక్కెర ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ జోరుగా సాగుతున్నది. కొద్దిరోజుల క్రితం కలెక్టర్ శరత్ పరిశ్రమ యాజమాన్యం, సీడీసీ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసి, వారానికి ఒకసారి బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ నుంచి క్రషింగ్ ప్రక్రియ ప్రారంభమవగా ఇప్పటి వరకు 71వేల మెట్రిక్ టన్నులు క్రషింగ్ జరిగింది. గత వారం రూ. 3.85 కోట్లు, శుక్రవారం రూ.2.15 కోట్లు, శనివారం రూ.కోటీ నాలుగు లక్షలు రైతుల బ్యాంకు ఖాతాలో యాజమాన్యం జమ చేసింది.
జహీరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణలో అత్యధికంగా చెరుకు సాగు చేసే ప్రాంతం జహీరాబాద్. ఎర్ర, నల్ల రేగడి భూముల్లో రైతులు బోరు బావుల ద్వారా చెరుకు పంటను సాగు చేస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో సాగు చేసిన చెరుకును కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్, సంగారెడ్డి, కర్ణాటక, మహారాష్ర్టాలలో ఉన్న చెరుకు ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తున్నారు.
జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో ఉన్న ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ గతంలో క్రషింగ్ చేయకుండా నిలిపివేయడంతో చెరుకు రైతులు సమస్యను పలుమార్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, సంగారెడ్డి కలెక్టర్ శరత్ దృష్టికి తీసుకువెళ్లగా, వారు స్పందించి క్రషింగ్ చేసేందుకు యాజమాన్యంతో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. దీంతో యాజమాన్యం గతేడాది నుంచి చెరుకు రైతులకు ఇబ్బందులు లేకుండా డబ్బులు చెల్లించడంతో పాటు చెరుకు క్రషింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రషింగ్ సీజన్ను నవంబర్లో ప్రారంభించి, చెరుకు సరఫరా చేసిన రైతులకు వారం రోజులకు ఒకసారి బిల్లులు చెల్లిస్తున్నారు.
ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీలో జోరుగా చెరుకు క్రషింగ్
జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) ట్రెడెంట్ చక్కెర ఫ్యాక్టరీలో క్రషింగ్ జోరుగా సాగుతున్నది. నవంబర్ చివరి వారంలో క్రషింగ్ను ప్రారంభించి ఇప్పటి వరకు 71 వేల టన్నుల చెరుకును క్రషింగ్ చేశారు. ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. ఫ్యాక్టరీలో క్రషింగ్ చేసే సమయంలో అంతరాయం లేకుండా కొత్తగా మిషన్లు ఏర్పాటు చేసి, కొత్త పరిజ్ఞానంతో చక్కెర ఉత్పత్తి చేస్తున్నారు.
చక్కెర రికవరీ తెలంగాణలోనే అత్యధికంగా జహీరాబాద్ ఫ్యాక్టరీలో ఉంది. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం చక్కెర రికవరీపై రైతులకు బిల్లులు చెల్లిస్తున్నది. ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాలున్నాయి. ఈ మండలంలో 18,500 ఎకరాల్లో చెరుకు సాగు చేసే 4,200 మంది రైతులు నుంచి ఫ్యాక్టరీ అగ్రిమెంట్ చేసుకుని క్రషింగ్ చేస్తుంది. రైతులకు క్రషింగ్లో ఇబ్బందులు లేకుండా జహీరాబాద్ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, చెరుకు అభివృద్ధి అధికారి రాజశేఖర్ పర్యవేక్షిస్తున్నారు.
రైతుల ఖాతాల్లో డబ్బులు జమ..
చెరుకు రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం పెండింగ్ బిల్లులను వారి ఖాతాల్లో జమ చేస్తున్నది. చెరుకు సరఫరా చేసిన రైతులకు గత వారం రూ.3.85 కోట్లు బ్యాంకు ఖాతాలో జమ చేసింది. శుక్రవారం రూ.2.15 కోట్లు, శనివారం రూ.కోటీ నాలుగు లక్షలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణరెడ్డి రైతులకు బిల్లులు చెల్లించడంతో పాటు క్రషింగ్కు చెరుకు సరఫరా చేసిన రైతులకు ఫ్యాక్టరీ వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. చెరుకు రైతులకు సరఫరా చేసిన వెంటనే బిల్లులు చెల్లించడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
ట్రైడెంట్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కలెక్టర్ సంగారెడ్డిలో ఫ్యాక్టరీ యాజమాన్యం, సీడీసీ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనాలు చేశారు. ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతులకు బిల్లులు చెల్లించేలా ఆదేశాలిచ్చారు. ఇప్పటి వరకు చెరుకు సరఫరా చేసిన రైతులకు యాజమాన్యం బిల్లులు చెల్లించింది. పెండింగ్ బిల్లులను కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది. ఫ్యాక్టరీ అగ్రిమెంట్ చేసుకున్న రైతు పొలంలో ఒక్క చెరుకు గడ లేకుండా క్రషింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– ఉమాకాంత్ పాటిల్, సీడీసీ చైర్మన్ జహీరాబాద్