రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. టెట్లో క్వాలిఫై అయిన వారు టీఆర్టీకి పోటీపడేందుకు అర్హులు. ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా నియామకాలు చేపట్టనున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 571 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈనెల 20 నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
– సిద్దిపేట, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టులను జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాలను అర్హత పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. సిద్దిపేట జిల్లాలో 141, మెదక్ జిల్లాలో 147, సంగారెడ్డి జిల్లాలో 283,ఉమ్మడి జిల్లాలో మొత్తం 571 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనెల 20 నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు నిర్ణీత దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తారు. దరఖాస్తు ప్రాసెసింగ్ మరియు రాత పరీక్ష కోసం ఒక్కో ఉద్యోగానికి రూ.1,000 రుసుం చెల్లించాలి. ఉద్యోగానికి అభ్యర్థి కనీసం 18 ఏండ్లు, గరిష్టంగా 44 ఏండ్లు కలిగి ఉండాలి. 01-07-2023 నాటికి వయసును లెక్కించబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే రెగ్యులర్ సర్వీస్ కాలంపై ఆధారపడి ఐదేండ్ల వరకు మాజీ సైనికోద్యోగులకు మూడేండ్లు మరియు సాయుధ దళాలలో చేసిన సర్వీసు కాలాన్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యుఎస్ వాళ్లకు ఐదేండ్లు, శారీరక దివ్యాంగులకు 10 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. ఉపాధ్యాయ ఆర్హత పరీక్షను 2023 నవంబర్ 20 -30 మధ్యకాలంలో నిర్వహిస్తారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 571 ఉపాధ్యాయ పోస్టులు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 571 ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. సిద్దిపేట జిల్లాలో 141 పోస్టులు ఉన్నాయి. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 60, లాంగ్వేజ్ పండిట్స్ 24, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 8, సెకండరీ గ్రేడ్ పోస్టులు 49 ఉన్నాయి. మెదక్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 70, లాంగ్వేజ్ పండిట్స్ 28, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 1, సెకండరీ గ్రేడ్ పోస్టులు 48 మొత్తం 147 పోస్టులు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 80, లాంగ్వేజ్ పండిట్స్ 24, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 5, సెకండరీ గ్రేడ్ పోస్టులు 174 మొత్తం 283 పోస్టులు ఉన్నాయి.
హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగార్ధులు
సమైక్య రాష్ట్రంలో ఎన్నడూ.. ఎప్పుడూ వేయని విధంగా పెద్దఎత్తున ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్నది.వివిధ శాఖల్లో పెద్దఎత్తున భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా డీఎస్సీ వేయడంతో ఉద్యోగార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని ఉద్యోగార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.ఇప్పటి కే వివిధ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరించారు. ఇక వయో పరిమితి దాటిన వాళ్లకు కూడా శుభవార్తే అని చెప్పాలి. ప్రత్యక్ష నియామకాల్లో పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయో పరిమితిని పదేండ్లకు పెంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఓసీలకు 44, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లు, దివ్యాంగులకు 54 ఏండ్లకు గరిష్ట వయోపరిమితి పెరుగుతున్నది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నారు. నిరుద్యోగులు అన్ని నియామక పరీక్షలో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాల వారీగా మొత్తం ఉపాధ్యాయ పోస్టుల వివరాలు