మెదక్, ఏప్రిల్ 16: యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. మెదక్ జిల్లాలో 326 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేలా పౌరసరఫరాల సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 67,933 హెక్టార్లలో ధాన్యం పండించారని, 3.77 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు కొనుగోలు చేయనున్నారు. అధికారులు గన్నీ బస్తాలతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 37 బాయిల్డ్, 120 రా రైస్ మిల్లులకు ముడి ధాన్యాన్ని తరలించుటకు జియో ట్యాగింగ్తో వెయ్యి లారీలు సమకూరుస్తున్నారు.
67,933 హెక్టార్లలో..
మెదక్ జిల్లాలో రైతులు 67,933 హెక్టార్లలో యాసంగి సీజన్లో వరి సాగు చేశారు. ఈమేరకు 3 లక్షల 77వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 102 కేంద్రాలు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 221 కేంద్రాలు, మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో 395 తేమను కొలిచే మీటర్లు, 450 ప్యాడీ క్లీనర్లు, 500 తూకం యంత్రాలు, 9,810 టార్పాలిన్లు, గన్నీ బస్తాలను అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లాలోని 76 మంది వ్యవసాయ విస్తరణాధికారులు తమ క్లస్టర్ పరిధి నుంచి వచ్చే ధాన్యాన్ని పూర్తిగా సేకరించేందుకు బాధ్యత తీసుకోనున్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా టోకెన్లు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయనున్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో బిల్లులు చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మద్దతు ధర ఇలా..
ధాన్యం మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. ఏ గ్రేడ్ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940గా నిర్ణయించింది. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక వసతులు, తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నారు. రైతులు పండించిన పంటను దళారుల వద్దకు తీసుకెళ్లవద్దని అధికారులు రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు.
మరో 70 లక్షల గన్నీ బస్తాలు అవసరం..
కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించడానికి గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, మాయిశ్చర్, క్లీనింగ్ మిషన్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 70 లక్షల గన్నీ బస్తాలు అవసరం కాగా, ప్రస్తుతం 5 లక్షల గన్నీ బస్తాలు అందుబాటులో ఉన్నాయి. ధాన్యం కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడానికి టాబ్స్ను మార్కెటింగ్, పీఏసీఎస్, డీఆర్డీవో, సివిల్ సప్లయ్ అధికారులు సిద్ధం చేస్తున్నారు.
కొనుగోలుకు సిద్ధం..
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాం. మెదక్ జిల్లాలో 326 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 5 లక్షల గన్నీ బస్తాలు అందుబాటులో ఉన్నాయి. మరో 70 లక్షల గన్నీ బస్తాల కోసం ఇండెంట్ పంపాం. ధాన్యం ఏ గ్రేడ్ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940గా ధరను ప్రభుత్వం నిర్ణయించింది. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలి.
– ఎస్.హరీశ్, కలెక్టర్ మెదక్