సిద్దిపేట బస్టాండ్కు 50 ఏండ్ల చరిత్ర
ఏడాదిలోపే సిద్దిపేటకు రైలు
ఆర్టీసీని కాపాడాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశం
70 ఏండ్లలో ఎవరూ చేయని పనులు ఎనిమిదేండ్లలో చేసుకున్నాం
ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు
సిద్దిపేట మోడల్ బస్టాండ్ను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్రావు, ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు
సిద్దిపేట అర్బన్, జూన్ 12 : తెలంగాణ ఉద్యమానికి అడ్డా అయిన సిద్దిపేట పాత బస్టాండ్కు ఎన్నో ఏండ్ల చరిత్ర ఉందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో రూ.6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిద్దిపేట మోడల్ బస్టాండ్ను ఆదివారం ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50 ఏండ్ల పాటు సేవలందించిన చరిత్ర ఈ బస్టాండ్కు ఉందని, నాడు పదుల సంఖ్యలో బస్సులు వందల సంఖ్యలో ప్రయాణికులు వచ్చేవారని, కానీ నేడు వందల సంఖ్యలో బస్సులు, వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. ఎంతో మంది విద్యార్థులు, కార్మికులు ప్రయాణం చేస్తుంటారని, వసతులు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడేవారన్నారు.
ప్రయాణికుల ఇబ్బందులు తొలిగించాలనే ఉద్దేశంతో మోడల్ బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కరోనా కారణంగా ఆర్టీసీ నష్టపోయి రెండేండ్ల పాటు నిర్మాణం ఆలస్యమైందన్నారు. ఇలాంటి సమయంలో సీఎస్ఆర్ నిధులతో పాటు దాతల సహకారంతో ఒక్క రూపాయి ఆర్టీసీ నుంచి తీసుకోకుండా బస్టాండ్ నిర్మించి ఆర్టీసీకి అప్పగిస్తున్నామన్నారు. ఆర్టీసీ ప్రజల జీవన చక్రమని, దాన్ని కాపాడాల్సిన భాద్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.
ఆర్టీసీని కాపాడాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశం..
ప్రభుత్వ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని, కానీ, కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీని అమ్మాలని సల హా ఇచ్చిందన్నారు. తాము రైల్వేలు, విమానసంస్థలు, ఎల్ఐసీ అమ్మినం.. మీరు కూడా ఆర్టీసీ, బస్టాండ్లను అమ్మాలను సలహా ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, సీఎం కేసీఆర్ ఆర్టీసీని కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి యేడాది రూ.1500 నుంచి రూ.3 వేల కోట్ల వరకు సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఎంతో మంది జీవితాలతో ముడిపడి ఉన్న ఆర్టీసీని కాపాడాలని సీఎం కేసీఆర్ చేదోడుగా ఉంటున్నారని చెప్పారు. కాళేశ్వ రం నీళ్లు తెచ్చి మల్లన్న పాదాలు కడిగి సీఎం కేసీఆర్ మొక్కు చెల్లుంచుకున్నారని గుర్తు తెచ్చారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన సిద్దిపేట బస్టాండ్ను నేడు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. బస్టాండ్ను ప్రయాణికులు పరిశుభ్రంగా కాపాడుకోవాలని సూచించారు. ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్న ఆర్టీసీ.. మహిళల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆమె కోరారు. అంతకుముందు బస్టాండ్ నిర్మాణానికి సహకరించిన ఆర్కిటెక్ట్, కాంట్రాక్టర్ను మంత్రి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం సిద్దిపేట నూతన బస్టాండ్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే బస్సును మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజులారాజనర్సు, ఏఎంసీ చైర్మన్ విజితావేణుగోపాల్రెడ్డి, ఆర్టీసీ ఎక్జుక్యూటీవ్ డైరెక్టర్ పురుషోత్తం నాయక్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వంగ నాగిరెడ్డి స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.
6 నెలల్లో నిర్మించడం రికార్డు..
మొదటిసారిగా తాను బస్సు ఎక్కి దిగింది సిద్దిపేట పాత బస్టాండ్లో. ఎన్నో సంవత్సరాల అనుబంధం బస్టాండ్తో తనకు ఉంది. ఎన్నో గంటలు బస్సుల కోసం వేచి చూసిన సందర్భాలు ఉన్నాయి. సిద్దిపేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన మం త్రి హరీశ్రావు బస్టాండ్ను మరిచిపోయారని అనుకునేవాడిని. కానీ 6 నెలల్లో ఇంత మంచి బస్టాండ్ నిర్మించడం ఆర్టీసీ చరిత్రలో ఇది రికార్డు. సిద్దిపేట అంటే దేశానికే ఆదర్శం. బస్టాండ్ అంటే ప్రజల సొమ్ము. ప్రయాణికులు శుభ్రంగా ఉంచుకోవాలి.
– మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి