మెదక్ న్యూస్ నెట్వర్క్, ఆగస్టు 23 ;ఎన్నికలు వస్తున్నాయని ఆగం కావద్దు. వచ్చిన సమయంలోనే మన ధీరత్వం ప్రదర్శించాలి. నిజం ఏమిటి..వాస్తవం ఏమిటి.. ఎవరు ఏం మాట్లాడుతున్నారు.. ఎవరు నిజమైన ప్రజాసేవకులో గుర్తిస్తేనే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. బాగా అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంటుంది.
ఎట్లుండే … ఎైట్లెయినం..
ఒకనాడు తాగేందుకు, పంటల కోసం నీటికి మనం గోసవడ్డం. ఇవాళ కాళేశ్వరం జలాలతో వాగులపై చెక్డ్యామ్లు మత్తళ్లు దుంకుతున్నాయి. మండుటెండల్లో నీళ్లు పారుతున్న దృశ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. నాడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మంజీరా జలాలను హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తరలించారు. తెలంగాణ వచ్చాక ఆ నీళ్లన్నీ మెదక్ ప్రాంతంలో సాగుకు అందిస్తున్నాం. పచ్చని పంటలు పండుతున్నయ్. జిల్లా అంతా సస్యశ్యామలం అయింది. మిషన్ భగీరథతో తాగునీటి సమస్య తీరిపోయింది. – మెదక్ ప్రగతి శంఖారావ సభలో సీఎం కేసీఆర్
మెతుకుసీమ జనసంద్రమైంది. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో కళకళలాడగా.. గులాబీదండు పోటెత్తడంతో గుబాళించింది. మెదక్ జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీకార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, క్రాంతికిరణ్, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో ఏర్పాటుచేసిన ప్రగతి శంఖారావం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు జనం పెద్ద ఎత్తున తరలిరాగా, జైతెలంగాణ..
జై బీఆర్ఎస్.. జైజై కేసీఆర్ నినాదాలు మిన్నటాంయి. కళాకారులతో కలిసి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన పాటలతో అందరినీ ఉత్సాహపరిచారు. ప్రగతి శంఖారావం వేదికగా సీఎం మెదక్ జిల్లాకు వరాల జల్లు కురిపించారు.
రెండు నెలలైనా ధాన్యం తగ్గటం లేదు..
ఇవాళ లక్ష్మీ అమ్మవారు ఓలలాడుతున్నట్లుగా అద్భుతమైన పంటలు పండుతున్నాయి. పండిన ధాన్యం మిల్లులకు లోడు చేయడానికి రెండు నెలలలైనా టైం సరిపోవడం లేదు. మన రైతులు అంతగానం పంట తీస్తున్నారు. బ్రహ్మాండమైన పంటలు పండించుకుంటున్నం.
– సీఎం కేసీఆర్
అపూర్వ స్వాగతం
బుధవారం మధ్యాహ్నం రోడ్డు మార్గం గుండా హైదరాబాద్ నుంచి మెదక్కు బయలుదేరిన సీఎం కేసీఆర్కు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో దారిపొడవునా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. గుమ్మడిదల టోల్ప్లాజా వద్ద పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి వేలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలసి గ్రాండ్వెల్కం చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రెండు నిమిషాలు ఆగి ప్రసంగించారు. అక్కడి నుంచి మెదక్కు చేరుకున్నారు. మెదక్ సీఎం పర్యటన విజయవంతమైంది.