మెదక్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో కార్పొరేట్స్థాయి వైద్యాన్ని అందిస్తోంది. జిల్లా కేంద్రంలో డయాలసిస్ కేంద్రంలో 10 యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మెదక్ జిల్లాలో 98 పల్లె దవాఖానలను ఏర్పాటు చేశారు. కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారి కష్టాలు తీర్చడం కోసం ప్రభుత్వం కంటివెలుగు పథకాన్ని అమలు చేస్తోంది. కేసీఆర్ కిట్తో 16 రకాల వస్తువులతో కూడిన కిట్ను అందిస్తున్నారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ ద్వారా కార్పొరేట్ సెంటర్లకు దీటుగా 57 రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు.
కంటివెలుగు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని 2018 మార్చిలో ప్రారంభించింది. 20 బృందాలతో మొత్తం 4,39,316 మందికి కంటి పరీక్షలు చేశారు. అందులో 61,695 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. 26,741 ప్రిస్కిప్షన్ అద్దాలు పంపిణీ చేశారు. మొదటి విడుత విజయవంతంగా కొనసాగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని 2023 జనవరి 18న ప్రారంభించింది. ఇప్పటివరకు 4,49 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 41వేల మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా, మరో 41వేల మందికి కంటి అద్దాలు కోసం ఆర్డర్లు ఇచ్చారు.
మెదక్ జిల్లాలో 98 పల్లె దవాఖానలు…
మెదక్ జిల్లావ్యాప్తంగా 98 పల్లె దవాఖానలను ఏర్పాటు చేశారు. అన్ని పల్లె దవాఖానలు ప్రారంభమై వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇదిలావుండగా జిల్లాకేంద్రంలోని గోల్కొండ వీధిలో బస్తీ దవాఖానల్లో ఇప్పటికే వైద్యులు, స్టాఫ్ నర్సు, హెల్పర్లను కూడా నియమించారు. మొత్తం 55 మంది స్టాఫ్ నర్సుల పోస్టులుండగా అందులో 22మంది బీఏఎంఎస్ డాక్టర్లు మిగతావారు స్టాఫ్ నర్సులు ఉన్నారు. అయితే పల్లె దవాఖానల్లో నియమితులైన బీఏఎంఎస్, స్టాఫ్నర్సులకు జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో శిక్షణ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ శిక్షణ మూడు నెలలపాటు కొనసాగింది. పల్లె దవాఖానల్లో విధులు నిర్వర్తించే స్టాఫ్ నర్సులు ఎలాంటి వైద్య సేవలు అందించాలి.. రోగులు వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేలా శిక్షణ ఇచ్చారు.
జిల్లా కేంద్రంలో 10 డయాలసిస్ యూనిట్లు
మెదక్ జిల్లా ప్రజలకు తెలంగాణ సర్కారు అందిస్తున్న ఓ అద్భుతవరం. జిల్లా కేంద్ర దవాఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు అయ్యింది. 2018 ఫిబ్రవరి 7వ తేదీన జిల్లా కేంద్ర దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. దవాఖానలో నాలుగు జనరల్ బెడ్లు, ఒక ప్రత్యేక బెడ్ సహా ఐదుబెడ్లతో కిడ్నీరోగులకు సేవలు అందుతున్నాయి. ఇందులో వారానికి ఒక సారి కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. డయాలసిస్ ఒక్కో యంత్రం ఖరీదు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల చొప్పున మొత్తం10 డయాలసిస్ యంత్రాలను జిల్లా కేంద్ర సర్కారు దవాఖానలో ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దవాఖానల్లో డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సుమారు రూ.కోటి వ్యయంతో ప్రభుత్వం కిడ్నీ ఫెయిల్ అయిన పేదలు డయాలసిస్ చేయించుకునేలా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో సౌకర్యం కల్పించింది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలు అంతాఇంతా కాదు. వ్యాధి తీవ్రతను బట్టి వారానికి రెండు, మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ప్రైవేట్ దవాఖానల్లో బిల్లు ఎక్కువ కావాల్సిందే. వారి ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తోంది. దీంతో రోగులు కూడా ఎక్కువగా వస్తున్నారు.
ప్రతినెలా 300లకు పైనే…
మెదక్ పట్టణంలో మాతాశిశు సంరక్షణ కేంద్రం గత ఏడాది జూన్ నుంచి అందుబాటులోకి వచ్చింది. అదే నెల నుంచి దవాఖానలో ప్రసవాలు చేయడం ప్రారంభించారు. ప్రతినెలా 300లకు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం నవంబర్లో అత్యధికంగా 407, జూన్ నుంచి ఇప్పటివరకు 4,168 ప్రసవాలు జరిగాయి. ఇందులో 2,208 సాధారణ ప్రసవాలు, 1960 ఆపరేషన్లు చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో మాతాశిశు సంరక్షణ కేంద్రం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 2,466 డెలివరీలు చేశారు. ప్రతినెలా 300లకు పైగా కాన్పులు చేస్తున్నారు. ఇందులోభాగంగా జూలైలో 111 నార్మల్ డెలివరీలు కాగా, 113 ఆపరేషన్లు అయ్యాయి. మొత్తంగా 224 డెలివరీలు చేశారు. ఆగస్టులో 199 నార్మల్, 139 ఆపరేషన్లు మొత్తం 338, సెప్టెంబర్లో 211 నార్మల్, 166 ఆపరేషన్లు మొత్తం 377, అక్టోబర్లో 208 నార్మల్, 176 ఆపరేషన్లు, మొత్తం 384 డెలివరీలు అయ్యాయి. నవంబర్లో 209 నార్మల్, 198 ఆపరేషన్ మొత్తం 407, డిసెంబర్లో 198 నార్మల్, 178 ఆపరేషన్లు మొత్తం 376 డెలివరీలు అయ్యాయి. 2023 జనవరి నుంచి మే వరకు 1702 డెలివరీలు అయ్యాయి. మొత్తం ఇప్పటివరకు 4,168 ప్రసవాలు జరిగాయి.
అందుబాటులోకి 57 రకాల పరీక్షలు…
తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా కార్పొరేట్ సెంటర్లకు ధీటుగా 57 రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్ల ద్వారా క్లినికల్ పాథాలజీ, మైక్రోబయాలజీ, క్లినికల్ బయోకెమిస్ట్రీకి చెందిన పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా బయోకెమిస్ట్రీకి చెందిన రేడియో ఏజ్, బ్లడ్ యూరియా, బ్లడ్ యూరియా నైట్రోజన్, డైరెక్ట్ ఎల్డీఎల్, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, జీజీటీ, లివిడ్ ప్రొఫైల్, ఎల్ఎఫ్టీ, పోస్ట్ లంచ్ బ్లడ్ గ్లూకోజ్, రాండమ్ బ్లడ్ షుగర్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, సీరమ్ బైలురూబిన్-డి, సీరమ్ బైలురూబిన్-టీ వంటి 36 రకాల టెస్టులు నిర్వహిస్తారు. అలాగే పాథాలజీకి చెందిన అబ్సల్యూట్ ఇసినోఫిల్ కౌంట్, కంప్లిట్ బ్లడ్ పిక్చర్, కోంబ్స్ టెస్ట్ డైరెక్ట్ వంటి మొత్తం 13 రకాల పరీక్షలు చేస్తారు. ఇంకా మైక్రోబయాలజీకి చెందిన చికున్గున్యా ఐజీఎం, డెంగీ, ఆర్పీఆర్ వంటి 8 రకాల టెస్టులు చేస్తాలు. ఇవన్నీ ఉచితంగా నిర్వహించడం ద్వారా బాధితులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతోంది. అంతేకాదు రోజుల తరబడి ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా 24 గంటల్లోనే టెస్ట్ ఫలితాలను ఆయా ప్రభుత్వ దవాఖానలకు, బాధితుల సెల్ఫోన్లకు సమాచారం పంపిస్తున్నారు. ఇదిలావుండగా మార్చి 8న ప్రారంభమైన ఆరోగ్యమహిళా కేంద్రాల నుంచి కూడా శాంపిళ్లు సేకరించారు. ఇందులో ఇప్పటివరకు 4,482 శాంపిళ్లు సేకరించి 16,288 పరీక్షలు చేశారు.
కేసీఆర్ కిట్…
కేసీఆర్ కిట్లో తల్లీబిడ్డలకు ఉపయోగపడే 16 ప్రత్యేక వస్తువులతో కూడిన కిట్ ప్రభుత్వం అందిస్తోంది. కేసీఆర్ కిట్ పథకం కింద ఇప్పటివరకు జిల్లాలో 31,311 మంది మహిళలు లబ్ధి పొందారు. 2015-16లో ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు 60శాతం మాత్రమే జరిగేవి. కేసీఆర్ కిట్ పథకం అమలుతోపాటు ఎంసీహెచ్ దవాఖానను బలోపేతం చేయడంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగి 82శాతానికి చేరాయి.
ఎంసీహెచ్లో పెరుగుతున్న గర్భిణులు
మాతాశిశువుల సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు వైద్యరంగాన్ని పటిష్ట పరుస్తోంది. ఇందులోభాగంగానే గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేంత వరకు, అలాగే శిశువుకు టీకాలు పూర్తయ్యేవరకు వైద్య సిబ్బందితో పర్యవేక్షణ చేయిస్తోంది. దీంతో జిల్లా దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. మాతాశిశు మరణాలు తగ్గాయి. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసూతి సేవలు అందించడంతోపాటు మాతాశిశువులను 102 వాహనాల్లో పైసా ఖర్చు లేకుండా ఇంటికి చేరుస్తోంది. దావాఖాన నుంచి తల్లీబిడ్డల స్వస్థలం ఎంత దూరమైనా క్షేమంగా గమ్యం చేరుస్తోంది. జిల్లా కేంద్రంలోని పిల్లికోటాల్ సమీపంలో రూ.17 కోట్లతో మాతాశిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)ను 2022 మే 28వ తేదీన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ 102 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చి బాలింతతోపాటు, సహాయకురాలు, ఆశ కార్యకర్త కూర్చొనేలా వాహనంలో సీటింగ్ సదుపాయం కల్పించారు. ప్రభుత్వాసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన బాలింత, పసిబిడ్డను వారి ఇంటి వద్దకు సురక్షితంగా చేర్చడమే లక్ష్యంగా 102 వాహనాల ద్వారా సేవలు అందిస్తున్నారు.